బంజారా జాతి రత్నం ” బానోత్ జాలం సింగ్ పుస్తక సమీక్ష

వ్యాసకర్త: కందుకూరి భాస్కర్

********

ప్రముఖుల జీవిత చరిత్రలు మనకు స్ఫూర్తినిస్తాయి. భావి తరాలు వారి మార్గంలో నడవడానికి ఆధారమవుతాయి. ఇప్పటి వరకు అనేక మంది జీవిత చరిత్రలు పుస్తకాల రూపంలో వెలువడ్డాయి.అందులో కొన్ని ఎవరికి వారు తమ జీవితానుభావలను స్వీయ చరిత్రగా రాసుకొనగా, మరికొందరి జీవిత చరిత్రలను ఇతరులు పరిశీలించి రాశారు. ఇతరులు రాసే జీవిత చరిత్రలు ఉహాగానాలతో కాకుండా ప్రముఖల జీవితాలను అధ్యాయనం చేసి వాస్తవాలను పొందుచేరచాలి. సమాజానికి ఆదర్శముగా ఉండాలి. ఆ విధంగా రచయిత, అధ్యాపకుడు రాథోడ్ శ్రావణ్ పరిశోధన చేసి రాసినాడే బానోత్ జాలం సింగ్ జీవిత చరిత్ర.బంజారా సమాజ హితం కోసం సమాజంలో పెరిగిపోయిన దురాచారాల నివారణ  కోసం, బాలికల విధ్య కోసం అహర్నిశలు కృషి చేసిన బంజారా జాతికే వన్నె తెచ్చిన మహానీయుడు బానోత్ జాలంసింగ్ జీవిత విశేషాలతో ఉపన్యాసకులు, రచయిత, పూర్వ ఆధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక,ముత్యాల హారం  రూపకర్త .రాథోడ్ శ్రావణ్  బంజారా జాతి రత్నం  “బానోత్ జాలంసింగ్” అనే జీవిత  చరిత్ర పుస్తకాన్ని వెలువరించారు.

ఈ పుస్తకంలో బానోత్ జాలం సింగ్ జీవితానుభావలను, కుటుంబ జీవనం, ఆధ్యాత్మిక భక్తిభావం, రాజకీయ జీవితం, నార్నూరులో విధ్య, వైద్య రంగాల అభివృధ్ధికి అయన చేసిన కృషిని  రచయిత తెలియ జేశారు. బంజారా జాతికి ఇతర సమాజానికి అతను చేసిన సేవలు, వేంకటేశ్వర మందిర నిర్మాణం, తెలంగాణ ఉద్యమ అనుభవాలు, వ్యక్తిగత విషయాలతో పాటు సకల అంశాలతో పూర్తి సమాచారాన్ని అందించారు. బానోత్ జాలంసింగ్ జీవితంలోని ముఖ్య ఘట్టాల చిత్రమాలికను కూడా అందులో పొందుపరిచారు. జాలంసింగ్ సందర్శించిన జ్యోతిర్లింగాలు, కుంభమేళాలు, తీర్థ యాత్రల గురించి విపులంగా  వివరించారు.

1943 లో అక్టోబరు 2న బానోత్ సుర్తాబాయి సక్రునాయిక్ దంపతులకు ఆదిలాబాదు జిల్లా నార్నూర్  గ్రామంలో జాలంసింగ్ జన్మించారు. చిన్న తనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అతను నానమ్మ,చిన్నమ్మ చిన్నాన్న వద్ద పెరిగారు.యాదృచ్చికంగా గాంధీ జయింతిని పుట్టిన జాలంసింగ్ గాంధీ గారి అడుగుజాడల్లో నడిచి శాంతియుత జీవనం గడిపారు.అహింసా మార్గాన్ని అనుసరించారు. సంఘ సంస్కర్తగా సమాజ సేవకుడిగా ఉద్యమకారుడిగా ప్రజలతో మమేకం అయ్యారు.అందుకే బంజారా ప్రజల చేత ఆదిలాబాద్ జిల్లా బంజారా గాంధీగా కొనియాడబడ్డారు.

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో  అయిన కృషి ఎనలేనిది. కుల మతాల కతీతంగా ప్రజా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేవారు. సమాజంలో పేరుకు పోయిన దూరచారాలు,వరకట్నుం,బాల్య వివాహాలు,మూఢనమ్మకాలు మొదలగు వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసి, యావత్ బంజారా సమాజానికి స్ఫూర్తిగా  నిలిచారు. గాంధేయ వాదిగా,పోరాట యోధుడిగా, బంజారా సంఘ సంస్కర్తగా,లంబాడీ ప్రజల హక్కుల కొరకు వారి ఆర్థికాభివృధ్ధి కోసం రిజర్వేషన్ల కోసం విశేషంగా కృషి చేశారు. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమాల్లో పాల్గొని తన ఉపన్యాసాల ద్వారా ప్రజలను చైతన్య పరిచారు.

నార్నూర్ మండలంలో ఆర్థికంగా వెనుకబడిన గిరిజన విద్యార్థుల కొసం గురుకుల కళాశాల మంజూరుకై కృషి చేశారు. అఖిల భారతీయ బంజారా సేవా సంఘం జాతీయ కార్యదర్శిగా బానోత్ జాలం సింగ్ వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు. బంజారా సంస్కృతి ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించే ప్రయత్నం చేశారు.లంబాడీ సమాజంలో  తెరవి (పెద్దకర్మ )కార్యక్రమాన్ని ప్రారంభించి తెరవికి‌ అద్యుడిగా నిలిచారు.తన సమాజంతో పాటు ఇతర సమాజానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన జంటలకు సాముహిక వివాహాలను జరిపించారు.

1967లో నార్నూరు గ్రామపంచాయితి ఉప సర్పంచ్ ఎన్నికతో రాజకీయ ప్రవేశం చేసిన జాలంసింగ్ 1970 నుండి2002 వరకు సుమారు 32 సంవత్సరాలు సుదీర్ఘ కాలం సర్పంచ్ గా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో ఎంపిటిసిగా, జడ్పీటీసిగా కూడా ప్రజలకు తన సేవాలు అందించారు.జిల్లా పరిషత్  ఉన్నత  పాఠశాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్, తపాలా కార్యాలయం, పశు వైద్యశాల,ఆయుర్వేద అసుపత్రి మొదలగు వాటి మంజూరీకై కృషి చేశారు.బాలికల ఆశ్రమ‌ పాఠశాల కోసం , గోండు ఆదివాసీల నివాసం కోసం, రైతు వేదిక,ధర్మశాల కోసం విరాళం తోపాటు భూదానం కూడా చేశారు.

భక్తి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ బాలాజీ మందిర నిర్మాణాన్ని శ్రీకారం చుట్టి అందరి సహాయ సహాకారాలతో ప్రారంభించారు.16 డిసెంబర్2020 న కరోనా బారిన పడి తుది శ్వాస విడిచారు. బానోత్ జాలంసింగ్ జీవిత చరిత్రను బంజారా సమాజంతో పాటు ఇతర సమాజానికి పరిచయం చెయ్యడం కోసం రచయిత రాథోడ్ శ్రావణ్ సోనాపూర్ నార్నూర్ గారు చేసిన కృషి అభినందనీయం. తమ జాతి ప్రజలను తన పోరాట పటిమతో మేల్నొల్పిన నాయకుడు బానోత్ జాలంసింగ్  జీవితాన్ని ఈ పుస్తకం ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేశారు రచయిత రాథోడ్ శ్రావణ్. రాబోవు రోజుల్లో ఇది బంజారా జాతి ప్రజలకే కాకుండా  పలువురికి ప్రేరణగా  నిలుస్తుంది. ఉట్నూరు సాహితీ వేదికకు పూర్వ అధ్యక్షుడిగా పనిచేసిన రాథోడ్  శ్రావణ్ అనేక  సాహితీ కార్యాక్రమాలు చేపట్టి మరిన్ని పుస్తకాలు రాసి తెలుగు  సాహితీ లోకానికి అందిస్తారని ఆశిద్దాం.

పుస్తకం వెల ₹=90

ప్రతులకు:-రాథోడ్ శ్రావణ్, రచయిత, ఇంటి నెం 2-2/1 ఐబి సుభాష్ నగర్, ఉట్నూరు ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ 504311. చరవాణి సంఖ్య : 9491467715

You Might Also Like

Leave a Reply