పలుకుసరులు : పారనంది శోభాదేవి

 వ్యాసకర్త : మానస చామర్తి 
ఇంట్లో పసివాళ్ళుంటే కాలమెట్లా పరుగులు తీసేదీ తెలియను కూడా తెలియదు. వాళ్ళ చివురు ఎరుపు పాదాలను బుగ్గలకు ఆన్చుకుని ఆ మెత్తదనానికి మురిసిపోవడాలూ, ఇంకా తెరవని గుప్పిళ్ళలో వేలు ఇముడ్చుకుని మైమరచిపోవడాలూ, పాలుగారే చెక్కిళ్ళనూ, పాలు కారుతుండే పెదవి చివర్లనూ చూస్తుండిపోవడాలూ ..వీటిలో పడితే చూస్తూ చూస్తూండగానే రోజులు వారాలు, వారాలు నెలలూ అయిపోతాయి. బోర్లాపడితే బొబ్బట్లు, పాకితే పాయసాలూ, అడుగులకు అరిసెలు, పలుకులకు చిలకలూ – దివ్యంగా వాళ్ళ పేరన పంచుకు తినడాలైపోతాయి. పొత్తిళ్ళలో పడుకుని అమ్మ చెప్పే కథలన్నింటికీ ఊఁ కొట్టడాలతో, తొట్టిగిలకలకేసి కాళ్ళను విసురుతూ ఉక్కూ ఉంగాలతో, ఉంగరాల జుత్తు మీద అందీ అందని చేతులు జోడించి “ఓవిందా” పెట్టడంతో, అత్తా తాతా అమ్మా నాన్నా..బోసి నవ్వులు, బుజ్జి బుజ్జి మాటలతో తోసుకుంటూ తోసుకుంటూ ఏడాది రివ్వున గడిచిపోతుంది.

ఇదిగో..ఈ ఏడాది నుండీ రెండేళ్ళ కాలం భలే గడ్డు కాలం. ఇంకా నడక కుదురే రాలేదని మనమొక వంక బెంగపడుతోంటే, వాళ్ళు మాత్రం అన్ని దిక్కుల్లోనూ పరుగులు తీసి గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తారు. వాళ్ళ అత్తిరిబిత్తిరి మాటలు అర్థమయ్యే లోపే ఇంకో పది ప్రశ్నలు మన దోసిట్లో పోస్తారు. ఆ వయసులో బట్టలు ఇట్టే పొట్టైపోయి నెల తిరిగేసరికి మరిక వాడటానికి వీలుకానట్టు, వాళ్ళకు నేర్పేవి కూడా ఇట్టే పాతబడిపోతునట్టు ఉంటాయి. ఏది చెప్పినా కళ్ళింతలు చేసుకు వినే వాళ్ళ ఆసక్తీ, ఎలా చెప్పినా ఇట్టే నేర్చుకుని వాళ్ళలో వాళ్ళే చెప్పుకుంటూ ఇల్లంతా తిరుగుతూ ఆడే పద్ధతీ చూస్తే, రోజూ రాత్రి వేళ మనమూ వాళ్ళ కోసం ఏదో ఒక హోంవర్క్ చేసి తీరాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చేస్తాం.

కానీ, ఏం చెప్పాలి? వాళ్ళకి ఏమీ తెలియవు కాబట్టి ఏమైనా చెప్పచ్చు కానీ, అన్నీ రుచులనూ పరిచయం చేసే వయసు కాదు. కనీసం రెండేళ్ళైనా వస్తే, “నీ పాద కమల సేవయు..” అంటూ ఓ దణ్ణం పెట్టుకుని, భాగవత పద్యాలో, శతక పద్యాలో, శ్లోకాలో మొదలెట్టవచ్చు కానీ..ఈ లోపో?

అదుగో, అప్పుడు తెలుస్తుంది తంటా! మనకసలు తెలుగులో ఈ వయసు వాళ్ళకు నేర్పేందుకు ఏం ఉన్నాయి?

“తారంగం తారంగం” అంటూ వాళ్ళ చిన్మయ రూపాన్ని చూస్తూ చెప్పినంత సేపు పట్టదు, చిద్విలాసంగా నవ్వుతూ వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోవడానికి. అటు పైన “చేత వెన్నముద్ద” చేతిలో పెడతామా, గుటుక్కున మింగేస్తారు. “చందమామ రావె” అంటూ రాత్రిళ్ళైతే రామకథను కూడా గరిపి జోకొడతామనుకోండీ! “బుజ్జి మేక బుజ్జి మేక ఏడకెళితివీ..” అంటూ రెండు చేతులతో అమాంతం ఎత్తుకుని గాలిలో ఊయలూపబోతే, తోటమాలి వస్తున్నట్టే దూకి తుర్రుమంటారు వాళ్ళు. ఈ లోపు తొలకరులు పడితే వానావానా వల్లప్పా అంటూ వాకిలంతా చుట్టబెడతారు కూడా.

“ఒప్పులకుప్పా వయారి భామా” నాకు వెగటుగా అనిపిస్తుంది ” రోట్లో తవుడు, నీ మొగుడెవరు” అన్న మాటలూ చంటివాళ్ళ నోట్లో వినడానికి ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. “బుర్రు పిట్ట బుర్రు పిట్ట” పాటతోనూ ఇలాంటి ఇబ్బందే. చంటిపిల్లలకి “మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది” అన్న సంగతెందుకో, కోరి వాళ్ళకి మొగుడి చేత మొట్టికాయ తినేవాళ్ళ గురించి నేర్పడమెందుకో, అందులో సరదా ఏమిటో అస్సలు అర్థం కాదు. పాడబుద్ధీ కాదు, పిల్లలకు నేర్పబుద్ధీ కాదు.

ఇట్లాంటి ఆలోచనలతో, కొన్ని మంచి తెలుగు పాటలు, పద్యాలు, సరదాగా సాగే వాటి కోసం చూస్తూన్నప్పుడు, మిత్రులొకరు ఒక పుస్తకం పంపారు. పారనంది శోభాదేవి గారు వ్రాసిన ఈ చిన్నపిల్లల పద్యాల పుస్తకం పేరు “పలుకుసరాలు”.

చూడగానే పిల్లలకు నేర్పాలనిపించేలా, కొన్ని పద్యాలు చాలా బాగున్నాయి. తేలిక పదాలతో వెనువెంటనే ఆకట్టుకున్నాయి.

మచ్చుకి కొన్ని:

“చిన్ని పొట్ట”
————

“సెనగ బెల్లపచ్చూ
తినగ తినగ హెచ్చూ
చిన్ని పొట్ట నొచ్చూ
డాక్టరపుడు వచ్చూ
చేదు మాత్రలిచ్చూ”

అలాగే ఆటల్లో ఆటగా తెలుగు అంకెలు కూడా నేర్పేయవచ్చు

“ఒకటీ రెండూ మామిడిపండూ
మూడూ నాలుగూ పారా పలుగూ
ఐదూ ఆరూ కొబ్బరి కోరూ
ఏడూ ఎనిమిది పాకం చలిమిడి
తొమ్మిదీ పదీ లడ్డూ బూందీ”

అలాగే “ఎవరా పాప” కూడా ముద్దుగా ఉంది.

“చెంపకు చారెడు ముద్దుల పాపా
పొంగిన బూరెల బుగ్గల పాపా
చిట్టీ చిట్టీ నడకల పాపా
నవ్వుల పువ్వుల వెన్నెల పాపా”

ఆ పాప ఎవరో కనుక్కోమనడం, అమ్మ చెప్పననడం – ఊహ అందంగా ఉంది. ఎత్తుకుని పిల్ల చెంపలను చెంపలకానించుకున్న బొమ్మ అందంగా అదే పేజీలో అమరిపోయింది.

ఆడపిల్లల అమ్మలందరూ హాయిగా నేర్పుకోగలిగిన మరొక ముచ్చటైన పద్యం “పావడా”. పుస్తకంలో ప్రాసలు మరికాస్త అందంగా అమరితే బాగుండని అనిపించింది. కొన్ని పద్యాలు మరీ పెద్దవైనాయి. అవి నేర్పడం పెద్దవారికీ, అంత పద్యాన్నీ వల్లె వేసి ఆటగా చెప్పుకోవడం పసివారికి, ప్రయాసవుతుంది. ఇట్లాంటి పుస్తకాలకి అటువంటి లక్ష్యం ఉంటుందని ఊహించలేం కనుక, ఆ పెద్ద పద్యాలను మినహాయించి ఉండవచ్చుననిపించింది. పుస్తకానికి పేరుగా పెట్టిన “పలుకుసరులు” పద్యం నిరుత్సాహపరిచింది.  ఎక్కువ పద్యాల్లో పిల్లలు రోజువారీ జీవితాల్లో చూసే వాటిని చొప్పించడం బాగుంది. ఆ పదాలు దొర్లినప్పుడల్లా పిల్లలకు ఒక కుతూహలపు చూపుతో వాటికి చెవులప్పగిస్తారు. అలాగే, వీలైనన్ని జంతువులూ, పిట్టలను  పద్యాల్లో ప్రవేశపెట్టడం కూడా పిల్లల ఆసక్తుల పట్ల రచయిత్రికి ఉన్న గమనింపుని పట్టి ఇస్తాయి. పుస్తకం పొడుగుతా, ఒక్క పద్యంలో పిల్లల పేర్లకు మినహాయిస్తే, ఒక్క సంయుక్తాక్షరమూ పడకపోవడం గొప్ప తెరిపినిస్తుంది. ఈ విషయంలో రచయిత్రి శ్రద్ధకు అభినందనలు.

ఐదేళ్ళ లోపు తెలుగు పిల్లలకు లేదా ఆ వయసు పిల్లలున్న పెద్దవాళ్ళకు, ఇలాంటి పుస్తకాలు బహుమతిగా ఇస్తే బాగుంటుంది. రిటర్న్ గిఫ్ట్‌ల జాడ్యం దండిగా అంటుకుపోయింది కనుక, పిల్లలకు ఈ తరహా పుస్తకాలిస్తే అవే చేతులు మారి పద్యాలు నోళ్ళల్లో నానుతుంటాయి. ఐ.పాడ్ లేనిదే అన్నం తినమని మొండికేస్తున్న పిల్లలకూ, అది ఇస్తే తప్ప అన్నం పెట్టలేని అమ్మలకూ ప్రయత్నిస్తే ఇలాంటి పుస్తకాలు, ఈ కొత్త రాగాల్లోని కొత్త పద్యాలు, కనీసం కొన్ని పూటలకైనా ప్రత్యామ్నాయంగా నిలబడగలవు. కొత్తదనాన్ని పిల్లలు ఆహ్వానించినంత సాదరంగా మనం ఆదరించలేం. ఈ సాహిత్యం వాళ్ళది కనుక, వాళ్ళకు అందజేసే బాధ్యతొక్కటీ మనది.

* పారనంది శోభాదేవి, “పలుకుసరులు”,

వెల: 65/-,

మంచి పుస్తకం ప్రచురణలు,
ఫోన్: 9490746614

You Might Also Like

One Comment

  1. Sasikala Volety

    సమీక్ష చాలా బాగుంది మానస! చంటిపిల్లలకు ఇంట్లో తెలుగుమాటలు మప్పడానికి మంచి పద్యాలు.

Leave a Reply