అతడు అడవిని జయించాడు

వ్యాసకర్త: భానుప్రకాశ్ కె.
************
కొన్ని పుస్తకాలు చూడగానే చదవాలని అనిపిస్తాయి. కొన్ని అలా కొని పక్కన పెడ్తామంతే. ఎప్పుడో గాని తీసి చదవము. అది కూడ ఎందరో మిత్రులు చదవమని చెబ్తే గాని చదవము. అలా ఒక పుస్తకాన్ని కొని పక్కన పెట్టేసి ఈ మధ్యనే చదివిన వాటిలో ఉన్న పుస్తకం కేశవరెడ్డి గారు రాసిన “అతడు అడవిని జయించాడు”. అసలు జీవితం ఎలా ఉన్నా మనం దానిని ప్రేమించాలి, సాధించాలి, పోరాడాలి, చివరకు జీవితాన్ని దాని అంచులవరకు జీవించాలి అని చెప్పే అద్భుతమైన షార్ట్ అండ్ స్వీట్ నవల. హెమింగ్ వే రాసిన “ఓల్డ్ మేన్ అండ్ ద సీ”, అలాగే బెంగాలీలో బిభూతి భూషన్ రాసిన “అరణ్యక్” (తెలుగు లో వనవాసి) నవలలను ప్రేరణగా తీసుకుని రాసిన ఈ నవల నిజానికి అంతకు మించి ఉంటుంది. కేశవరెడ్డి గారు 1984 లో రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ పాఠకుల ఆదరణకు నోచుకుంటుంది అంటే దాని కారణం ఈ పుస్తకం చదివితేనే అర్థమవుతుంది.

ఈ పుస్తకం లోని కథ క్లుప్తంగా జీవితపు చరమాంకం లో ఉన్న ఒక పండుముసలి వాడు. పందులని పెంచుకోవడమే అతని వృత్తి. దాని తోనే అతను తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. అతనికో ఓ మనవడు. తాతని అనుసరిస్తూ ఉంటాడు. అంటే ఇతను ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటాడన్నమాట వాళ్ళ తాత దగ్గర.ఐతే ఓ రోజు మేతకు వెళ్ళిన సుక్క పంది ఎప్పటకి ఇంటికి తిరిగి రాదు. ఆ పిల్లవాడికి కూడా తెలియదు. తాతకి మనసు మనసులో ఉండదు. ఎందుకంటే ఆ సుక్క పంది సూలు తో ఉంది (సూలు అంటే కడుపుతో ఉంది అని). వెంటనే తాత ఆ అడ్విలోకి ఆ పందిని వెతుక్కుంటూ వెళ్తాడు. తనకి కొన్ని రోజులుగా ఒంట్లో నలతగా ఉన్నా సరే. తాతకి అడవిలో అణువణువు తెలుసు. అడవిలో తప్పిపోయిన తన పందుల్ని ఎలా కనుక్కోవాలో తెలుసు. అసలు ఆ సుక్క పందిని కనుక్కోవడానికి ఒక గువ్వ పిట్ట సహాయం చేస్తూ ఉంటుంది. అసలు గువ్వ పిట్ట మరో ఇంటరెస్టింగ్ కేరెక్టర్ ఈ బుక్లో. ఇది అడవిలో ఎటువంటి వింత జరిగినా ఊరకే ఉండదు. అలా అలా అది అందరికి తెలిసేలా అరుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా భాషలో చెప్పాలంటే ట్విట్టర్ లేదా నెవ్స్ చానెల్ లా అన్నమాట. ఖచ్చితంగా అది అందరకి తనే చెప్పెయాలనే ఆత్రుత దానికి. నిజానికి ఈ గువ్వ పిట్ట లేకపోతే ఆ చీకటిలో తాతకు కనుక్కోవడం దాదాపు అసాధ్యం. ఎలా అయితేనేం తాత సుక్క పందిని కనుక్కుంటాడు. కాని అంతా మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది?. పిల్లలతో ఉన్న సుక్క పందిని పిల్లల లేలేత మాంసం తినేయాలని దాని పైకి దాడిచేసే నాలుగు నక్కలు .. ఇవే మన కథ లో విలన్లు. సుక్క పందిని దానిని పిల్లలతో సహా ఆ నక్కల బారినుంచి తప్పించడానికి తాత పడీన కష్టాలు, చివరకు ఒక ప్రాణాన్ని కాపాడడానికి ఇంకో ప్రాణాన్ని వదులుకోవడంలో తాత పడిన మానసిక సంఘర్షణ, ఈ కథ లోని బిగింపుని పతాకస్థాయికి తీసుకెళ్తుంది. తాత పడే బాధ మన గుండెల్ని కూడా పిండేస్తుంది. కేశవరెడ్డి గారి కథనం మనల్ని తాత తో పాటు ఆ పంది పిల్లల్ని కాపలా కాసేలా చేస్తుంది. ఇలా చెప్పుకుంటు పోతే మొత్తం కథ అంతా ఇక్కడే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నా కథ చెప్పడం.

అసలు ఈ కథకి ప్రాణం రచయిత తీసుకున్న నేపథ్యం. అడవి, అందులో ఒక పందులని కాసే ముసలి వాడు. అదికూడ జీవితాన్ని జీవితంగానే చూస్తాడు. అది కూడ ఒక సహజమైన ప్రక్రియలా. తన పందులు, చిన్న పాక, ఆ అందమైన ప్రకృతి, ఆ చిన్న పిల్లాడు ఇదే తన జీవితం. ఈ కథ అంతా రాత్రి మొదలయ్యి తెల్లారే సరికి అయిపోతుంది. ఈ కథలోని తాత్వికత అంతా ఇక్కడితోనే మొదలవుతుంది. అంటే ఒక మనిషి పయనం చీకటి నుంచి వెలుగులోకి, అది కూడా చీకటి మన జీవితం లోకి తెచ్చే ఎన్నో కష్టాలను ఓర్చుకుని వెలుగులోకి. ఆ పందులని తినడానికి వచ్చిన నక్కలు మనం కూడబెట్టుకున్నదానిని మన నుంచి తీసుకుపోయే అవకాశవాదులు. అంత అంధకారంలో కూడా ఆ పందులు ఎక్కడ ఉన్నాయొ చెప్పే ఆ తోడు పిట్ట మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా మనతో ఉండే స్నేహితులు. ఇక ఆ పంది పిల్లలు మన ఇష్టాలు, కోరికలు, ఆస్తులు, పాస్తులు, ఇంకా మన ఆశలు. ఆ సుక్క పంది మన జీవితం. ఆ పిల్లల్ని ఎలా కాపాడాలి అనే అతని సంకల్పం తన తర్వాత తరాన్ని ఎలాగైన కాపాడుకోవాలనుకునే ఆరాటం, ఆయన పయనం చీకటి నుంచి వెలుగుకి. ఆ రాత్రంతా ఆ కష్టాల కారడవిలో ఆయన జీవించాడు. మనకో జీవిత సత్యాన్ని చెప్పాడు. అందుకే ఆయన అడవిని జయించాడు. నిజానికి ఆయన జీవితాన్ని పూర్తిగా జీవించాడు. మనం ఎలా జీవించాలో చెప్పాడు.

ఇలాంటి కథని ఎంచుకోవడమే ఒక సాహసం, అది కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంటుంది ఈ కథ. బుక్లో లోతైన ఆ తాత్వికత మనల్ని ఎంతో కాలం వెంటాడుతూనే ఉంటుంది. మనం నిత్యం అసహ్యించుకునే పందుల్ని వాటి అరుపుల్ని ఇక నుంచి మీరు కొత్తగా చూస్తారు ఈ పుస్తకం కనక చదివినట్టైతే. పుస్తకం కొత్త ప్రింట్లో మంచి ఆకర్షణీయంగా ఆల్మోస్ట్ పాకెట్ బూక్ సైజ్లో ఉంది. చదివి మీరు కూడా అడవిలో ఒక సాహస యాత్రకి బయలుదేరండి.

You Might Also Like

11 Comments

  1. mula veereswara Rao

    నిజానికి అడవిని జయించాడు పేరు సరైనది కాదేమో ! చివరికి ఒక్క పంది పిల్లని కాపాడ లేక పోయాడు
    ముసలి వాడి పాత్ర లో రచయితా ఎక్కువ గా దూరి తత్వాలు ఒలికించడం కొంచం విసుగ్గా అనిపిస్తుంది !
    అడవి లో ఆరాటం అంటె సరిపోయేది !
    శిల్పం అద్భుతం గా ఉన్న కదా విషయం లో కొంచెమ శ్రద్ద పెట్టవల్సింది ! కేశవ రెడ్డి గారు చివరికి పాత్రల వైఫ్యలం కోరుకొని విషాదం గా ముగించారు ! ఈ నవల కన్నా రాముడు ఉన్నాడు రజిమ్మే ఉండాది నవల వాస్తవికం గా ఉంటుంది !

  2. Satish

    Real life super story but animals changed now very super

  3. gavidi Srinivas

    Let Me Cry -Gavidi Srinivas +918722784768 ,9985010538

    The moment I remember you
    you will be down poured
    as my tear drops
    When I look at the cloud
    you will be stretching your hands
    from the cloud.
    When I look at the flower
    you will be smiling
    in the flower
    When I touch the wall
    you will be questioning
    What you are doing
    But your physical presence is a myth
    Let me cry
    until my heart is frozened.

  4. sreeram velamuri

    { బెంగాలీలో బిభూతి భూషన్ రాసిన “అరణ్యక్” (తెలుగు లో వనవాసి) నవలలను ప్రేరణగా తీసుకుని రాసిన ఈ నవల} …..కరెక్ట్ కాదేమో సర్

    1. మంజరి లక్ష్మి

      నాకు అల్లాగే అనిపిస్తోంది. ఇంకా ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ ప్రేరణ కావచ్చు అరణ్యక్ కి దీనికి అంత పోలికేమి లేదు.

  5. P Sunitha

    అతడు అడవిని జయించాడు – అద్భుతమైన పుస్తకం.చాలా ఏళ్ల క్రింతం చదివాను.అనిమల్ ఫార్మ్ తర్వాత ఏక బిగిన చదివిన పుస్తకం ఇదే.హెమ్మింగ్వే కన్నా బాగ అనిపించింది. ఎవరైనా పరిచయం చేస్తారేమో అని ఎదురు చూశాను. నిజానికి పిల్లల పాఠ్య పుస్తకం గా చేస్తే బాగుంటుంది. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

  6. D Madhusudana Rao

    నేను ఈ పుస్తకాన్ని 20 సంవస్తరాలు పైగానే అయ్యింది. ఈ కథ మనలో చాల ఉద్వేగాన్ని నింపుతుంది. ఈకథ అయిపోయేవరకు ఆపకుండా చదివిస్తుంది. చదవదగిన పుస్తకం.
    ఈపుస్తకాన్ని విద్యార్దుల చేత చదివిన్చాగాలిగితే బాగుంటుంది.

  7. Kumar Narasimha

    ఎర్నెస్ట్ హెమింగ్వే ‘ఓల్డ్ మాన్ అండ్ ది సీ’ కూడా ఇలాంటి తాత్విక ఇతివృత్తమే. హెమింగ్వే కథలో ముసలాడు సముద్రాన్ని, అందులో ఒక పెద్ద సొర చేపని జయిస్తాడు. అలాగే, హెర్మన్ మెల్విల్ ‘మోబి డిక్’ కథ కూడా గుర్తుకు వస్తుంది. కేశవ రెడ్డి గారు ఈ కథని ఇంగ్లీష్ లో వ్రాసిఉంటే, బహుశా ప్రపంచ ఖ్యాతి వచ్చున్డేదేమో? ఇంత గొప్ప కథకుడు ఉన్నందుకు, తెలుగు వాళ్ళం గర్వించి అందరిచేతా చదివించాలి. Thanks for the essay.

  8. bhanu prakash

    శివారెడ్డి గారిది కేశవరెడ్డి పేరు ఎందుకో మొదటి నుంచి కంఫ్యూజ్ అవ్తున్నా నేను, క్షమించాలి రియల్లీ అయాం సారి ఇంకొసారి ఇలా జరక్కుండా చూసుకుంటా సౌమ్య గారు.

  9. వురుపుటూరి శ్రీనివాస్

    రచయిత పేరు కేశవరెడ్డి కదా?

    1. సౌమ్య

      corrected the text in the article now. Thanks.

Leave a Reply