కథాక్రమంబెట్టిదనిన………

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
                మానవుడు మాటలు నేర్చినది మొదలు నేటి వరకూ అవిచ్ఛిన్నంగా సాగుతున్న ఏకైక సాహిత్య ప్రక్రియ కథాకథనం. కథ వివిధ కాలాలలో వివిధ దేశాలలో వివిధరూపాలు సంతరించుకొన్నది. (కథా ప్రక్రియ ఈ దేశం నుంచి మనకు వచ్చింది, నవలా ప్రక్రియ ఆ దేశం నుంచి మనకు వచ్చింది అనేవి గుడ్డి మూఢనమ్మకాలు.)

              వేదాలలోని సంహితలలోను, బ్రాహ్మణాలలోను, ఉపనిషత్తులలోను, రామాయణ, మహాభారతాలలోను, పురాణాలలోను, చిన్నవి, పెద్దవి వేలకొలది కథలు నిక్షిప్తములై ఉన్నాయి. క్రమంగా లౌకిక వాఙ్మయంలో వివిధరూపాలలో విస్తృతప్రచారం సంపాదించాయి.

ప్రాకృతకథలకు అర్థమాగధిలో,బౌద్ధమునకు సంబంధించినకథలు జాతకకథలు, అతినిగూఢమైన తత్త్వరహస్యాలను విశదీకరించడానికి కథల వినియోగం అత్యధికంగా చేయబడింది. తిలోయపణ్ణత్తి, జ్ఞాతాధర్మకథ, ఉవాసగదన మొ.నవి ఘటనారూపాలైన కథలే.

అనేక కథల సంకలనమైన నాయాధమ్మకహాఓ లో కథాసాహిత్యం యొక్క వికాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఉపదేశకథలతో పాటు జంతుకథలు కూడా ఉన్నాయి. ఉవాసగదసాఓ లో దివ్యజీవనకథల సంగ్రహం కనిపిస్తుంది. ఈ కథలలో కౌటుంబిక జీవనం, సామాజిక జీవనం, ధార్మికజీవనం చక్కగా చిత్రించబడ్డాయి. ప్రశ్నోత్తరశైలిని ప్రవేశపెట్టడం చేత కథలు ప్రభావవంతంగా ఉంటాయి. ఉత్తరాధ్యయనం సుఖబోధ టీకలో చిన్నాపెద్దా కలిసి మొత్తం 150 కథలున్నాయి.

కథలలో రాజులు, సేనాపతులు, మంత్రులు, సార్థవాహులే కాక సామాన్యవ్యక్తులు కూడా నాయకులు గా ఉన్న కథలున్నాయి. ఆనాటి సమాజపరిస్థితుల చిత్రణం కథలలో కనబడుతుంది. రాత్రింబవళ్ళు చాకిరీ చేసి అలసిపోయే కోడళ్ళు, గయ్యాళి అత్తలు, క్రూరస్వభావం గల గృహిణులు, అతిధిసేవకోసం సర్వస్వం అర్పించే గృహస్థులు, రోజంతా పని చేసినా రెండు పూట్లా కడుపునిండా అన్నం లేని కర్మకరులు- వీళ్ళందరి వర్ణనా కూడా కథలలో  ఉంటుంది. ధనికాదుల చేతులలో సామాన్యజనుల బాధలు కూడ చిత్రీకరించబడతాయి.

ప్రాకృత కథలలో అనేక భేదాల ప్రతిపాదనం ఆయా గ్రంథాలలో కనబడుతుంది.

అకథ, కథ, వికథ అని కథ మూడువిధాలని దశవైతాలికం లో చెప్పబడింది.

౧. సంసారంలో ఉండడానికి కారణమైన మిథ్యాదృష్టితో రచించిన కథ అకథ. అంటే మన రోజువారీ కష్టసుఖాలు, కోరికలు, కన్నీళ్ళు, నవ్వులు, సంఘర్షణలు ఇవన్నీ ఏవీ శాశ్వతాలు కావు. కాలచక్రంలో ముందుకు, వెనక్కూ తిరిగేవే అని తెలుసు కాబట్టి ఇది మిథ్యాదృష్టి అన్నారు కానీ ఈ కథనాలను తిరస్కరించలేదు. వీటినీ ఒక భాగం గానే గుర్తించారు.

౨. సద్గుణాలను పెంపొందిస్తూ లోకకల్యాణానికి హేతువయ్యే కథ కథ. దీనికే సత్కథ అని కూడ పేరు. మంచీ చెడు రెండూ ఉన్నాయని అంగీకరించినా రెండింటి ప్రస్తావనా ఉన్నా కూడా ఏది స్వీకరింపతగినది అనే లోకకల్యాణం గురించి ఆలోచింపజేసే కథలన్నమాట.

౩. రాగం, ద్వేషం, స్త్రీలంపటత్వం, భోజనమాత్రాసక్తి, చోరులు మొదలైన విషయాలను గూర్చి వ్రాసిన కథ వికథ. అంటే నేటి జీడిపాకం సీరియల్స్ కథలవంటివన్నమాట. వాటికి కాలక్షేపం తప్ప ఏ విలువా ఉండదు.

గ్రహించవలసినదేమిటంటే అకథ, వికథ మానవులలో నైతికప్రవృత్తిని పెంపొందించవు సరికదా దానికి విరుద్ధమైన అవినీతి ని సమాజంలో పెంపొందిస్తాయి. నేటి కాలంలో మనం వీటికే ప్రాధాన్యతనివ్వబట్టే సమాజం అలాగే తయారవుతోంది.

ఆగండాగండి, కథ కథ అక్కడితో అయిపోలేదు.

౧. విషయాన్ని బట్టి కథ అర్థకథ, కామకథ, ధర్మకథ, మిశ్రకథ అని నాలుగు విధాలు.

ఆత్మకల్యాణకారి, లోకశ్రేయస్సాధనమూ అయిన ధర్మాన్ని ప్రధానంగా బోధించేది ధర్మకథ,

ధర్మానికి విరుద్ధం కాని అర్థసంపాదనోపాయాదులను, ధర్మానికి విరుద్ధం కాని విషయోపభోగాన్ని సూచించే కథలు అర్థ కథ, కామకథ.

ఈ మూడు అంశాలు కలగలిపి ఉన్నకథ మిశ్రకథ.

౨. పాత్రలను బట్టి కథ దివ్యకథ, మానుషకథ, దివ్యమానుష కథ అని మూడు రకాలు.

దేవతల చరిత్ర ప్రధానంగా ఉంటే అది దివ్యకథ.

మానవుల చరిత్ర ప్రధానంగా ఉంటే అది మానవ కథ.

మిశ్రితం అంటే రెండూ కలిపి ఉంటే అది దివ్యమానవ కథ.

౩. వస్తువును బట్టి కథ సకలకథ, ఖండకథ, ఉల్లాపకథ, పరిహాసకథ, సంకీర్ణకథ అని ఐదు విధాలు.

ఒక మహాపురుషుని పరిపూర్ణచరిత్ర తో పాటు వివిధరసాల నిర్వహణంచేత మనోహరమైన, బృహత్ప్రమాణమైన (పెద్ద) కథ సకలకథ.

ఒక వ్యక్తి జీవితంలోని ఒక హృదయావర్జకమైన సంఘటనను తీసుకొని రచించిన చిన్నకథ ఖండకథ.

సముద్రయానం, పర్వతారోహణం మొదలైన సాహసకార్యాలను, అసంభవములైన కార్యాలను వర్ణిస్తూ రచించిన కథ ఉల్లాప కథ.

హాస్యవ్యంగ్యాత్మకమైన కథ పరిహాసకథ.

పై భేదాలలోని అంశాలు కొన్ని కలవడం చేత అధికంగా మనోరంజకంగా ఉండే కథ సంకీర్ణకథ.

కథాగ్రంథాలలోని భాష

జ్ఞానపంచమీకథలో మహేశ్వరసూరి -” అల్పబుద్ధి కలవాళ్ళు సంస్కృతం అర్థం చేసికొన జాలరు. అందుచేత సామాన్యజనులకు కూడ అర్థం అవడం కోసం ప్రాకృతం లో కావ్యరచన చేయబడుతున్నది. గూఢపదాలు, దేశీపదాలు లేకుండా సులలితపదాలతో గుంఫితమైన ఇలాంటి కావ్యాలు ఎవరికి ఇష్టం కావు?” అంటాడు.

(ఈమధ్యే స్వాతంత్రం వచ్చాకే వ్యవహారిక భాషోద్యమం మొదటిసారి జరిగిందని గిడుగువారినో, గురజాడ వారినో ఆరాధ్యదేవుళ్ళుగా భావించేవారు గమనించగలరు. వారిని అధిక్షేపించడం నా ఉద్దేశం కాదు. ఇది గొప్పపనే కానీ మొదటిసారి జరిగింది కాదు. మళ్ళీ జరిగింది. -లక్ష్మీదేవి)

ఈ కథలలో ఉపయోగించిన భాష మహారాష్ట్రి అయితే సంస్కృతం, అపభ్రంశాలు కూడా స్వేచ్ఛగా ఉపయోగించబడ్డాయి. మధ్యమధ్య అనేక సంస్కృత అపభ్రంశ సూక్తులూ చేర్చబడ్డాయి.

హరిభద్రుడు దశవైతాలిక టీకలో రచించిన కథల్లో ఎన్ని రకాల కథలున్నాయో చూడండి.

౧. సంఘటనలు, కార్యనిర్వహణా ప్రధానంగా ఉన్నవి -తొమ్మిది

౨. చరిత్ర ప్రధానకథలు -23

౩. భావనాప్రధాన కథలు-6

౪.వ్యంగ్యప్రధానకథలు -7

౫. బుద్ధి చమత్కారప్రధాన కథలు -12

౬.ప్రతీకప్రధాన కథలు-3

౭. మనోరంజక కథలు-4

౮.ఉపదేశప్రధాన కథలు -11

౯.ప్రభావ ప్రధాన కథలు -5

అంతేకాక హరిభద్రుడు రచించిన వ్యంగ్యప్రధాన కథ ధూర్తాఖ్యానం. ఈ గ్రంథం ద్వారా రచయిత వైదికమతంలోని కొన్ని విశ్వాసాలను పరిహాస పూర్వకంగా నిరాకరించినప్పటికీ ఇది ఒక విశిష్ట సాహిత్య ప్రక్రియ ఏర్పడడానికి కారణమైంది(అనుకుంటున్నా) ఈ కథలో ఐదు ఆఖ్యానాలు (కథలు) ఉన్నాయి. అతిశయోక్తి పూర్ణములూ, అసంభావ్యములూ అయిన వృత్తాంతాలను అవహేళన చేయడం కోసం రచించినది. ఉజ్జయిని సమీపంలో ఉన్న ఒక ఉద్యానవనంలో మూలదేవుడు కండరీకుడు , ఏలాషాఢుడు, శశుడు, ఖండాపాణా (స్త్రీ) అను ధూర్తశిఖామణులు సమావేశమై  ఒక నిర్ణయం తీసుకొన్నారు. మన ఐదుగురూ తమ తమ అనుభవాలను చెప్పాలి. ఆ అనుభవాలను విశ్వసించని వారు మిగతావారికి భోజనాలు పెట్టాలి.( వీరిలో ఒక్కొక్కరికీ ఐదువందలమంది అనుచరులు కూడా భోజనానికి )

కథ అలా మొదలై, అందరి (ఊహాజనిత) అనుభవాల వర్ణనతో ముగుస్తుంది.

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారిచే రచింపబడిన ప్రాకృతభాషావాజ్ఞ్మయ చరిత్ర అనే పుస్తకం లో కథ గురించి ఇన్ని వివరాలూ ఉన్నాయి.

ప్రాకృత భాష కుటుంబాల గురించీ, వాటి వికాసం గురించీ, విశిష్టతలగురించీ,వాటి కాలాదుల గురించీ విస్తృతంగా  చర్చించింది.

పాలి, అర్ధమాగధి, మాగధి, పైశాచీ, మహారాష్ట్రీ , చాండాలి, ఢక్కీ, శబరీ, అవంతీ, శౌరసేని మొదలైన భాషల సాహిత్యం , జైన సాహిత్యం గురించీ,

అశోకుడు, కుక్కుకుడు మొదలైన వారి  శిలాశాసనాలలో , అశ్వఘోషుడు, భాసుడు, శ్రీహర్షుడు మొదలైన వారి నాటకాలలో ప్రాకృత, అపభ్రంశ రూపాల గురించీ, హేమచంద్రాచార్య విరచిత ప్రాకృతవ్యాకరణం గురించీ ప్రస్తావనలే కాక, అనేక ప్రాకృతకథల సంక్షిప్త వివరణ కూడా ఈ పుస్తకంలో లభ్యమౌతుంది.

ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రులవారి అనేక అమూల్యమైన గ్రంథాలలో ఇదీ ఒకటి . ఆసాంతం ఆసక్తికరంగా సాగుతుంది. అనేక విషయాల గురించి తెలియజేస్తుంది.

You Might Also Like

4 Comments

  1. చందు తులసి

    @స్వతంత్రం వచ్చాకే వ్యవహారోద్యమం వచ్చిందనుకునే వాళ్ళు…..
    ఆ ఉద్యమం స్వతంత్రానికి ముందే జరిగింది…స్వతంత్రం రావడాని కన్నా ముందే గురజాడ
    గిడుగు గారు పరమపదించారు

    1. లక్ష్మీదేవి

      పొరబాటే. సవరించుకుంటాను. (వ్యాసంలో ‘పుస్తక’కర్తలు సవరించాలి.)
      నా ఉద్దేశ్యం అయితే మీకర్థం అయిందనుకుంటాను. 🙂

  2. లక్ష్మీదేవి

    కథ కు సంబంధించిన ఇన్ని వివరాలు నాతో పాటు తెలియనివాళ్ళెందరో ఉన్నారనిపించిందండి. అందుకే వ్రాశాను.

  3. rvss srinivas

    చాలా బాగా వ్రాసారు లక్ష్మీదేవి గారు ….
    మీకు అభినందనలు ….@శ్రీ.

Leave a Reply to rvss srinivas Cancel