కొల్లాయి గట్టితే నేమి? (ఒక ఉత్తమ చారిత్రక నవల) – 2

రాసిన వారు: రాచమల్లు రామచంద్రారెడ్డి
(ఈ వ్యాసం “సారస్వత వివేచన” వ్యాసాలలోనిది. మొదటి భాగం ఇక్కడ. యూనీకోడీకరించడానికి సహకరించిన వేణూశ్రీకాంత్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్. )
*****************************************
సంభాషణల్లోని నాటక తత్వాన్ని సరిగా వినియోగించుకోలేకపోవడానికి రామమోహనరావుగారి రచనాతత్వంలోని లోపమే కారణమని తోస్తుంది. నవలకు గానీ, యే సాహిత్య రూపానికిగానీ చరమ ప్రయోజనం ఒకటే -పాఠకునికి ఉత్తమ సంస్కారం కలిగించడం. ఇది పాఠకుని హృదయంమీద గాఢమయిన అనుభూతుల ముద్రలు వేయడం ద్వారా జరుగుతుంది. కానీ, పాఠకుని వివేకాన్ని ప్రబోధించడం ద్వారా జరగదు. రామమోహనరావుగారి రచనా తత్వంలో జ్ఞానదానదృష్టి (Didactic or pedagogic approach) బలంగా వున్నందువల్లనే గతంలో ఆయన రచించిన ’ఎవరికోసం’, ’కత్తుల వంతెన’ అనే నవలలు కళాత్మకంగా దెబ్బతిన్నాయి. ఆ ఙ్ఞానదాన దృష్టి యీ ’కొల్లాయిగట్టితేనేమి ?’ లో అంత బలీయంగా లేదుగానీ, ఆవాసన పూర్తిగా చావనందువల్లనే నవలలోని సంభాషణలు నిర్జీవంగా తయారైనాయని నా అనుమానం. సంభాషణలు మరింత సజీవంగా, మరింత నాటకీయంగా వుండివుంటే, నవలలోని అనేక సన్నివేశాలు పాఠకుల హృదయాలమీద మరింత గాఢమైన ముద్రలు వేయగలిగి వుండేవి; నవల మరింత కళాత్మకమైన విలువను సంతరించుకొని వుండేది.

రచయితలోని జ్ఞానదానదృష్టి మరొక విషయంలో కూడా వెల్లడవుతున్నది. బెజవాడలో కాంగ్రెసుకమిటీ సమావేశం జరుగుతున్నపుడు వలంటీర్ల సమ్మె జరిగింది. తత్ఫలితంగా బహిరంగ సభ అల్లకల్లోలమై, గాంధీమహాత్మునికి ఆ రాత్రి భోజనం తప్పిపోయింది. ఇది చరిత్ర. ఈ చారిత్రక ఘటనకు నవలలోని కథతో సంబంధం యేమీ లేకపోయినా, నవలలో చోటుచేసుకుంది. ఆనాటి చరిత్రలో జరిగిన ఒక ఆసక్తికరమైన ఘటనను పాఠకులకు తెలియజేయాలనే జ్ఞానదానదృష్టి తప్పితే, యీ ఘటనవల్ల నవలకు ఒరిగిన ప్రయోజనమేమీ కనిపింఛదు. ఈ ఘటనవల్ల నవలకు జరిగిన నష్టమేమీ లేదనుకున్నా, రామమోహనరావుగారి రచనా తత్వంలోని బలహీనత మాత్రం వ్యక్తమౌతున్నది.

ఈ నవలలో గమనించదగిన విశేషాంశాలు కొన్ని ఉన్నాయి. రామనాథానికి చిన్నప్పుడే పెండ్లి అయింది కానీ, అతని భార్య కాపురానికి రానని అతనితో తెగతెంపులు చేసుకుంది. స్వరాజ్యానికి కూడా చిన్నప్పుడే పెండ్లి అయింది. కానీ, ఆమె భర్త మళీ పెండ్లిచేసుకొని స్వరాజ్యాన్ని పరిత్యజించినాడు. బ్రహ్మ సమాజపు విశ్వాసాలు గల అబ్బాయినాయుడు (స్వరాజ్యం తండ్రి) కూతురుకు పునర్వివాహం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. కులం యేదైనా సరే విజ్ఞాన వివేకాలున్న వరుడు కావాలని మాత్రమే అతని కోరిక. కానీ స్వరాజ్యం తాను ప్రేమించిన రామనాథాన్ని పెండ్లి చేసుకుంటానన్నప్పుడు అబ్బాయినాయుడు తలమీద పిడుగు పడినట్లు బాధపడతాడు. కూతురును గద్దించి లొంగదీసుకోడానికి ప్రయత్నిస్తాడు; లాలించి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. స్వరాజ్యం ఆ ప్రయత్నాలన్నిటినీ ధిక్కరించి, రామనాథం పట్ల అతనికి గల అభ్యంతరమేమిటో చెప్పమంటుంది. నిజానికి అభ్యంతరమేమిటో అతనికే తెలియదు. కూతురుకేమని చెప్పగలడు! ’రామనాథం అందగాడు, ఆరోగ్యవంతుడు, మంచి చదువుంది. సంఘ సంస్కరణ దృక్పథం వుంది. దేశం అంటే ప్రేముంది. నాయుడు అభిమానించే అన్ని లక్షణాలూ వున్నాయి. కాని అతనిని కూతురు వరుడుగా అంగీకరించలేకున్నాడు, చేతకావడంలేదు. ఆ అభ్యంతరమేమిటో మాటకు అందడంలేదు.’

ఆ అభ్యంతరం యేమిటో మనకు తెలుస్తూనే వుంది. అది కేవలం అంతరాత్మకు సంబంధించింది. అంతరాత్మ అనేది మానవుని వ్యక్తావ్యక్త మనస్సు (Sub-conscious mind) లో గూడుకట్టుకున్న విశ్వాసాల సంపుటి. ధర్మాధర్మాలకూ, నీత్యవినీతులకూ సంబంధించిన విశ్వాసాల సంపుటి. మానవుని చుట్టూ వున్న సమాజంలోని విశ్వాసాలే పసితనం నుండి అతని మనసులో ప్రవేశించి వయసు వచ్చేటప్పటికి స్థిరపడి అంతరాత్మరూపం ధరిస్తాయి. వయసు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి అర్జించే నూతన విద్యా విజ్ఞానాల ఫలితంగా ధర్మాలను గురించి అతని అభిప్రాయాలు మారవచ్చు. కానీ వ్యక్తావ్యక్త మనస్సులోని అతని విశ్వాసాల పట్టు సులభంగా సడలదు. అనగా, వ్యక్తి వివేకం యెదిగినంతగా అతని అంతరాత్మ యెదగదు. తత్కారణంగా వ్యక్తులకు అంతరాత్మ పీడనలూ, అంతస్సంక్షోభాలూ ఏర్పడుతుంటాయి. రామమోహన రావుగారీ అంశాన్ని చరిత్రకు అన్వయించిన తీరు ఆయన ఊహాశక్తికి గొప్ప నిదర్శనం మాత్రమేగాక, సమాజానికీ, వ్యక్తికీగల నిగూఢ సంబంధాలను గురించి ఆయనకున్న గాఢ గంభీర పరిజ్ఞానాన్ని వెల్లడి చేస్తుంది.

చరిత్రయే మార్పులకూ లోను గాకుండా నిలువ నీరులాగా వున్న కాలంలో ధార్మిక విశ్వాసాలు తరతరాలుగా నిశ్చల నిశ్చితాలుగావున్న సమాజంలో యిటువంటి అంతస్సంక్షోభాలు సాధారణంగా యెవరికీ కలగవు. కానీ, ఆ విశ్వాసాలు తరతరానికీ మారుతున్న యుగసంధిలో జన్మించిన మానవులకు యీ అంతస్సంక్షోభాలు తప్పవు. అబ్బాయినాయుని అవస్థ అదే. అతని కూతురు పునర్వివాహం చేసుకోడానికి హిందూధర్మశాస్త్రమూ, బ్రహ్మసమాజ ధర్మమూ ఒప్పుకోకపోయినా అతనికది ధర్మంగా కనపడింది; అతని బ్రహ్మ సమాజ మిత్రులెవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ రామనాథానికి అంతకుముందే పెండ్లి అయి భార్య సజీవంగాకూడా ఉంది. అతని పునర్వివాహానికి బ్రహ్మ సమాజం ఒప్పుకోదు. అబ్బాయినాయుని అంతరాత్మ బ్రహ్మ సమాజనీతుల మేరకు యెదిగిందే కానీ, ఆ పైన యెదగలేదు. వధూవరుల కిరువురికీ గతంలో వివాహాలైనా, ఉభయుల వివాహాలూ సంపూర్ణంగా భగ్నమైనాయి గనుక ఉభయులూ పునర్వివాహానికర్హులే అని అతను అంగీకరించలేకపోతున్నాడు. నిజానికి అతని వివేకం అంగీకరిస్తుంది. కానీ అంతరాత్మ అంగీకరించదు. రామనాథం వివాహం భగ్నం కావడంలో అతని దోషమేమీలేదు గనుక అతను మళ్ళీ పెండ్లి చేసుకోవడం ఏ మాత్రం తప్పులేదంటాడు నాయుడు. కానీ తన కూతురుకు మాత్రం అతన్ని వరుడుగా అంగీకరించలేడు. రామనాథం పునర్వివాహాన్ని హిందూ సమాజం ఆమోదిస్తుంది. స్వరాజ్యం పునర్వివాహాన్ని బ్రహ్మసమాజంలో అందరూ కాకపోయినా కొందరయినా ఆమోదిస్తారు. ఆ యిరువురి పరస్పర వివాహాన్ని ఏ సమాజమూ ఆమోదించదు. ఎవరూ ఆమోదించని వివాహం వివాహమెలా అవుతుంది అదీ నాయుని బాధ. సామాజిక ఆమోదం లేనిదే వివాహం అనేది వుండజాలదనే విశ్వాసమే అతని అంతస్సంక్షోభానికి కారణం. వివాహ విషయంలో అతని అంతరాత్మ సమాజానికిచ్చిన నిర్ణాయక స్థానమే అతని బాధకు హేతువు. వాళ్ళ సంబంధాన్ని ప్రజలు వివాహంగా గుర్తించరు. వ్యభిచారం అంటారు. ఉంచుకున్నాడంటారు; దానికదే పేరు. ఫలానా నాయుడు కూతుర్ని ఎవడో లేవదీసుకు పోయాడంటారు, ఉంచుకున్నాడంటారు. అదీ అతని అంతరాత్మ పడే ఆందోళన.

చివరకు అతని అంతరాత్మ మీద అతని వివేకం జయిస్తుంది. వాళ్ళ వివాహానికి అంగీకరిస్తూ, “ఎదో తప్పు చేసినట్లు, ఎరిగివున్న వాళ్ళకి ముఖంమాటు చేసుకునే మనస్థితి మీ పెళ్ళికి ప్రధానమైన శత్రువు. మన సంఘంలో ఉన్న ఆచారాలూ, అలవాట్లూ ఆ మనస్థితికి మూలం. దానినుంచి బయటపడి సుఖపడం” డని ఆశీర్వదిస్తాడు.

“మన సంఘంలో ఉన్న ఆచారాలూ, అలవాట్లూ ఆ మనస్థితికి మూలం” అనడంలో అంతరాత్మ జన్మస్థానమేమిటో స్పష్టంగా వివరిస్తున్న రామమోహనరావు గారు యెందుకో ’అంతరాత్మ’ అనే పదం మాత్రం వాడకుండా, ’మనస్థితి’ అనే అన్నారు. బహుశా అంతరాత్మను దైవాంశగా భావించే సంప్రదాయం దేశంలో ఉన్నందువల్ల ఆ మాటను ఆయన బహిష్కరించినట్లుంది. ’అంతరాత్మ’ అనే మాటనే రచయిత ఉపయోగించి ఉంటే అబ్బాయినాయుని మనస్సంకోచానికి మూలమేమిటో పాఠకులందరికీ సులభ గ్రాహ్యంగా వుండేది. అదే దెబ్బతో అంతరాత్మలోని దైవాంశకూడా చావుదెబ్బతిని వుండేది.

పదప్రయోగం యెట్లున్నా, యుగసంధిలో జీవించేవాళ్ళు తమ అంతరాత్మలతో చేయవలసిన పోరాటం ఏమిటో, ఎలా ఉంటుందో అబ్బాయినాయుని పాత్రద్వారానేగాక, స్వరాజ్యం, రామనాథంల పాత్రలద్వారాకూడా చిత్రింపబడింది. ఒక యుగసంధిలో భిన్న చారిత్రక ధర్మాల మధ్య జరిగే చారిత్రక సఘర్షణను వ్యక్తుల వ్యక్తిత్వాలలో జరిగే అంతస్సంఘర్షణగా చిత్రించడం చాలా అరుదైన కళాభిజ్ఞత. చరిత్ర సారాన్ని ఈ విధంగా మానవ హృదయానుభూతుల పరిభాషలో అవగాహన చేసుకోవడం చాలా అరుదైన భావుకత. యుగసంధిలోని వ్యక్తుల అంతరంగిక ఆవేదనలకూ సామాజిక వ్యవస్థలకూ గల సంబంధాన్ని వివరించడంలో రచయితకు గల మేధా పరిపాకం అపురూపమైనది. ’ఆ వివాహాన్ని సంఘం ఒప్పుకోదు. చట్టం ఒప్పుకోదు. ప్రాచీన సంప్రదాయ పద్ధతివారి వివాహ బంధాన్ని కూర్చలేదు. ఆధునిక సంప్రదాయమంటూ ఏర్పడలేదు.’ ఆధునిక సంప్రదాయం వూరకే ఏర్పడదు.. ఆధునిక జీవులు యేర్పరిస్తే తప్ప. అది ఏర్పడిందాకా బాధలు తప్పవు. అదే యుగసంధి తత్వం. ప్రాచీన సంప్రదాయాలను భగ్నంచేసి వాటి శిథిలాలమీద ఆధునిక సంప్రదాయాలను నిర్మించడమే యుగసంధిలోని వ్యక్తుల చారిత్రక కర్తవ్యం. ఎవడో ఒకడు విప్లవకారుడయి ముందు నిలబడితే తప్ప, వీరుడై తక్కినవాళ్ళకు మార్గదర్శకత్వం వహిస్తే తప్ప, ఆధునిక సంప్రదాయాలంటూ ఏర్పడవు. ఆధునిక సంప్రదాయాలు నిత్యం ఏర్పడుతుంటే తప్ప సమాజం నిలువ నీటి మురికిగుంట అవుతుంది; ఈ నవల ద్వారా చరిత్ర మనకిచ్చే సందేశం యిదే.

ఈ నవలలోని మరొక విశేషాంశం పాత్రల ప్రవర్తనలోని అంతర్వైరుధ్యాలు.

రామనాథం తన మిల్లుబట్టలు అగ్ని సాక్షాత్కారం గావించి ’సత్యాగ్రహ ప్రతిజ్ఞ తీసుకొన్నప్పుడు తోటివాళ్ళంతా(తోటి విద్యార్థులు) చప్పట్లు కొట్టేరు. హుషారు చేసేరు. వాళ్ళే మళ్ళీ రాత్రి తనగదికి వ్రేలు మొగాలు వేసుకువచ్చి చదువు మానేస్తున్నందుకు అంత బాధపడ్డారు. ప్రతిజ్ఞ నుంచి బయటపడేందుకు అన్ని మార్గాలు చూపించేరు.’ విద్యార్థుల ప్రవర్తనలోని యీ అంతర్వైరుధ్యం నవల ప్రారంభంలోనే మనకు పరిచయమౌతుంది.

రామనాథం పడవలో ప్రయాణం చేసేటప్పుడు పడవ గుమస్తా అతన్ని సరంగుకు పరిచయం చేస్తూ, “పంతులుగారెవరో తెలుసా? గాంధీగారి మనిషి, పులి. మొన్న సభలో ఏం మాట్లాడేశారు; ఎంత బాగుంది ! ఓహ్ !” అంటూ పరవశంతో ప్రశంసిస్తాడు. అదే గుమస్తా రామనాథంతో పడవగదికి కేవు(ఛార్జీ), ఇతరులతో కంటే రెండణాలు యెక్కువ వసూలు చేస్తాడు.

అబ్బాయినాయునికి కాంగ్రెస్ అన్నా, గాంధీ అన్నా ఎంతో భక్తి. అటువంటివాడు ఓ పక్క గాంధీ కాలేజీలు వదలమంటూ ఉంటే, తన కూతురును కాలేజీకి పంపడానికి సిద్ధపడ్డాడు.

రామనాథం పెదనాన్న విశ్వనాథంకూడా అంతే. ఆ చుట్టుపక్క గ్రామాలలో అతనే ప్రథమ జాతీయవాది. కాంగ్రెస్ సభలకనీ, సమావేశాలకనీ తిరగడంలోనే ఆస్తి అంతా పాడయింది. కానీ, చదువుమాని గ్రామాలకు రావలసిన వాళ్ళలో తన కొడుకును మాత్రం ఎన్నడూ లెక్కవెయ్యలేదు.

గాంధీకి ముంగండలో స్వాగతం యివ్వడానికి జరిగే ప్రయత్నాలలో గవరయ్య రేయింబవళ్ళూ పాల్గొంటున్నాడు. ’స్వరాజ్యగీతా’లనే పుస్తకాలు తెచ్చి ఊర్లో అమ్ముతున్నాడు. కుర్రవాళ్ళలోని దేశభక్తి ఉత్సాహాన్ని వినియోగించుకొని అతను ఆ పుస్తకాలమీద ఎక్కువ ధర గుంజినాడు. “నేనెవ్వరినీ మోసం చెయ్యలేదు. రెట్టింపు ఖరీదు ఇస్తే పుస్తకాలు యిస్తానన్నాను. బలవంతం ఏముందీ ?” అని వాదిస్తాడు. “లేకపోతే ఈ తిరగడానికి డబ్బులేవీ? పన్నెండు పుస్తకాలు అమ్మేను. రెండురోజుల భత్యాలొచ్చాయి.“ అని సమర్థించుకొంటాడు.

రామనాథంతో పాటు కాలేజీ చదువు మానుకొని సత్యాగ్రహ ప్రతిజ్ఞ తీసుకొన్న విద్యార్థులలో మంగరాజు ఒకడు. అతని తండ్రి సూపరింటెండింగ్ ఇంజనీరు. ఆ మరుదినమే తన పలుకుబడివల్ల కొడుకుని మళ్ళీ కాలేజీలో చేర్పిస్తాడు. ఆ ఇంజనీరే గాంధీ ప్రయాణ సౌకర్యార్థం ప్రభుత్వానికి అర్థంకాని పద్ధతిలో కొన్ని ఏర్పాట్లు చేస్తాడు. ’ఆత్మాభిమానం చంపుకొని, ప్రిన్సిపాల్ కు క్షమార్పణ చెప్పుకొని, కొడుకు కాలేజీలో చేరేటట్లు ఒత్తిడి పెట్టిన ఇంజనీరు ఈనాడు గాంధీగారి ప్రయాణ సౌకర్యం కోసమే రాజోలు ప్రయాణం పెట్టుకొని వుంటాడన్నది’ రామనాథం ఊహలకు కూడా అందని విషయం.

రామనాథం పెంపుడు తండ్రి శంకర శాస్త్రికి గాంధీమీదా, కాంగ్రెస్ మీదా యెప్పుడూ సదభిప్రాయంలేదు. అతని ఆచార పరాయణత్వమూ, జాతీయోద్యమ ప్రభావంతో తనకొడుకు సర్వనాశనమైనాడనే భావమూ కారణం కావచ్చు. గాంధీ ముంగండకు వస్తున్నప్పుడు ఆ శంకరశాస్త్రే తాటాకుమీద భగవద్గీతా శ్లోకం ఒకటి చక్కటి గుండ్రని అక్షరాలతో జాగ్రత్తగా రాసి, అక్షరాలు స్ఫుటంగా కనిపించేటందుకు కాకరాకు పసరు రుద్ది, గాంధీకి విరాళంతో పాటు సమర్పించడానికి తయారు చేసినాడు. గాంధీని తల్చుకొని “ఒక్కొక్క జాతకం..” అంటూ ’ఏదో అదృశ్య శక్తికి ఓ నమస్కారం చేశాడు.’

వ్యక్తుల వ్యక్తిగత ప్రవర్తనలోని యూ ద్వంద్వ స్వభావమే గాక, సామాన్య జనుల సామూహిక ప్రవర్తనలోని ద్వంద్వ స్వభావంకూడా నవలలో నిర్ద్వంద్వంగా చిత్రింపబడింది. ఆచార సంపదకూ, వేదవిద్యా సంపదకూ బ్రాహ్మణ అగ్రహారాలకు ముంగండ తలమానికం వంటిది. చెరువులో చేపలు పట్టితే జీవహింస జరుగుతుందనీ, చెరువులో నీళ్ళు పంచములు ముట్టుకుంటే చెరువే మైల పడుతుందనీ చెరువుకు రేయింబవళ్ళూ కావలి వుంటారు ఆ వూరి బ్రాహ్మణులు. రామనాథం తన తోటలోని బావినీటిని హరిజనులు తోడుకోడానికి అనుమతించడం ఎవరికీ ఆమోదయోగ్యం కాదు. కానీ ఆ పనికి ప్రారంభోత్సవం చేయడానికి కాశీనాథుని నాగేశ్వరరావు వచ్చినప్పుడు ఆ సద్బ్రాహ్మణులే చిత్రంగా ప్రవర్తిస్తారు. ’కాశీనాధుని నాగేశ్వరరావుగారు వచ్చేరు. ఆయన్ని పలకరించే వాడుండడేమోనని రామనాథం దిగులు. కానీ, ఆయన మత్తుమందు చల్లినట్లు ముంగండ బ్రాహ్మణ్యాన్ని తనచుట్టూ తిప్పుకున్నారు… (ఊరేగింపుగా) రాజవీథివెంట వెడుతుంటే రెండుమూడు ఇళ్ళవద్ద దండలువేసి హారతులిచ్చేరు. జైలులో మైలపడి ఆనాటివరకు సంఘ బహిష్కృతుడుగావున్న రామనాథంతోనూ, నాగేశ్వరరావుతోనూ కలిసి, బ్రాహ్మణ యువకులు కొందరు సహ పంక్తి భోజనం చేసినారు; వాళ్ళకు వీరసనాతనుడైన సాంబావధాని వడ్డన వూళ్ళో పెద్దలు పదిమంది తాము భోజనాలు చేస్తుంటే సావట్లో కూర్చుని ఉన్నారు’ వాతావరణమంతా “ ఈ అనాచారాన్ని ముంగండ పండితులు ఆశీర్వదిస్తున్నారా” అనిపించేట్లు వుంది.

నాగేశ్వరరావు పట్లనేకాదు. గాంధీపట్ల కూడా వాళ్ళ ప్రవర్తన అంతే. అంటరానితనాన్ని నిర్మూలించడానికి కంకంణం కట్టుకున్న గాంధీని వేదోక్తాశీస్సులతో సమాదరించడానికి తయారవుతారు, అంటరాని వాళ్ళని బ్రాహ్మణ వీథుల్లో కూడా నడవనియ్యని సద్బ్రాహ్మణులలో కొందరు.

వైయక్తిక ప్రవర్తనలోనూ, సామాజిక ప్రవర్తనలోనూ అంతర్వైరుధ్యాలున్న పాత్రలు యీ నవలలో యాదృచ్ఛికంగా చోటుచేసుకున్నవి కావు. రచయిత ఉద్దేశ పూర్వకంగానే చిత్రించినట్లు అర్ధమౌతూనే ఉంది. ఐతే దీనికి కారణం యేమిటి? పాత్రలు తమ స్వభావాలకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారా? స్వభావమంటే యేమిటి ? హేతుబద్ధంగా ప్రవర్తించవలసిన పాత్రలు హేతురహితంగా ప్రవర్తిస్తున్నారా? దీని ప్రయోజనమేమిటి?

జీవితంలోని అనంత వైవిధ్యాన్ని సాహిత్యం సరిగా ప్రతిబింబించలేదనే విమర్శ అనాదిగా ఉంది. సాహిత్యంలోని యీలోపానికి కారణం Aldous Huxley వంటివాళ్ళు యీ విధంగా చెప్తారు: సాహిత్యం యెప్పుడూ హేతుబద్దం (rational) గా ఉంటుందనీ, జీవితం చాలా హేతురహితం (irrational) గా ఉంటుందనీ, హేతువాదం (rationalism) మీదా, కార్యాకారణ సూత్రం (law of causality) మీదా విశ్వాసం లేని ఒక రకం మనుషులకు మార్మిక వాదులూ (mystics), అతీంద్రియ వాదులూ (transcendentalists) మొదలయిన వాళ్ళకు యీ వాదం చాలా ప్రీతిపాత్రం. ఈ కోవకు చెందిన గోపీచంద్ లాంటి వాళ్ళు సాహిత్యం జీవితమంత విశాలంగానూ ఉండాలంటూ రచించిన నవలలు లక్ష్యశుద్దీ, భావైక్యమూ, కథన పాటవమూ కోల్పోయి, చివరకు జీవితమంత గందరగోళంగానూ, జీవితం కనిపించేటంత అర్థరహితంగానూ, జీవితంకంటే నిస్సారంగానూ తయారు కావడం మనమెరిగిన విషయమే. వీళ్ళు జీవితాన్నీ, సాహిత్యాన్ని అర్థం చేసుకోవడంలోనే ఒక మౌలికమైన పొరపాటు వుంది.

జీవితం హేతురహితంగా కనబడుతుందేకాని, నిజానికి హేతురహితం కాదు. కారణ రహితమైన కార్యంకానీ, కార్యరహితమైన కారణంగానీ జీవితంలో ఉండవు. కానీ, జీవితంలో ప్రతికార్యానికీ అనేక కారణాలు ఉంటాయి. అట్లే ప్రతికారణానికీ సాధారణంగా అనేక కార్యాలు ఉంటయి. అంతేగాక, ప్రతికారణానికీ సద్యః ఫలితమైన కార్యాలేగాక కాలాంతర ఫలితాలు కూడా వుంటాయి. ప్రతి కార్యానికీ సధ్యః కారణమే గాక కాలాంతర కారణాలు కూడా వుండవచ్చు. అంతేగాక, కార్యమే మళ్ళీ కారణంలో మార్పు తెచ్చి, తానే కారణ రూపం ధరిస్తుంది. భర్త ప్రవర్తనను బట్టి భార్య ప్రవర్తన మారుతుంది. తత్ఫలితంగా భర్త ప్రవర్తనలో మార్పువస్తుంది. అందువల్ల భార్య ప్రవర్తనలో మరొకమార్పు వస్తుంది. అందువల్ల భర్తలో ఒక కొత్త మార్పు వస్తుంది. అంనంతంగా సాగే యీ కార్యకారణ ఘర్షణలో కారణమూ, కార్యమూ నిశ్చల తత్వాలు కావు. రెండూ ఒకదానికొకటి కారణాలే. రెండూ ఒకదానికొకటి కార్యాలే. దీనినే dialectics అంటారు. అందువల్ల వాస్తవ జీవితంలో కార్యకారణాలు అన్నీ ఒకదానితో ఒకటి బీరకాయ పీచులాగా పెనవేసుకొని, యేది దేనికి కారణమో, యేది దేనికి కార్యమో విడదీయడానికి సాధ్యం గాకుండా ఉంటాయి. తత్కారణంగా జీవితం హేతు రహితంగా కనపడవచ్చునేగాని, నిజానికి అత్యంత హేతుబద్ధమైనది.

ఇక సాహిత్యం అచ్చం జీవితంలాగే ఉండాలనుకోవడం కూడా తీవ్రమైన పొరపాటే. జీవితాన్ని అర్థం చేసుకోడానికి మానవుడు చేసే ప్రయత్నంలో ఒక భాగమే సాహిత్యం (మరొకభాగం సైన్సు). ఒకదాన్ని అర్థం చేసుకోవడమంటేనే దానిలోని కార్యకారణ సంబంధాన్ని తెలుసుకోవడం, దానిలోని హేతుబద్ధతను గ్రహించడం. కనుక జీవితం మానవునికి యే మేరకు అర్థమౌతుందో, యే మేరకు అర్థమైనట్లు భాసిస్తుందో, ఆ మేరకే జీవితం సాహిత్యంలో ప్రతిఫలిస్తుంది. అనగా హేతుబద్ధమైన జీవితమే సాహిత్యంలోకి యెక్కుతుంది. అనగా సాహిత్యం హేతు బద్ధంగా తప్ప మరొకవిధంగా వుండజాలదు. సాహిత్యం మరీ హేతుబద్ధంగా ఉంటున్నదని నిందించడం ఈ యుగపు మేధావుల అతి తెలివికి మాత్రమే నిదర్శనం.

కాని, అపరిణతులైన సాహిత్యకారులు జీవితంలోని సంకీర్ణ హేతు బద్దతను గ్రహించలేక పాత్రలనూ, సన్నివేశాలనూ సరళరేఖలాంటి కార్యకారణ సూత్రంలో బంధించి, సాహిత్యాన్ని ఎక్కాల బుక్కు తర్కస్థాయికి దించుతున్న దించుతున్న మాట నిజమే. జీవితంలో ప్రతి వ్యక్తిమీదా నిత్యం పరస్పర విరుద్ధమైన అనేక అంతర్బహిఃప్రేరణలు పని చేస్తుంటాయి. ప్రతి వ్యక్తిలోనూ స్వార్థమూ వుంటుంది, పరోపకార బుద్ధీ ఉంటుంది; అహంకారమూ ఉంటుంది; మమకారమూ ఉంటుంది; కామక్రోధాదులూ ఉంటాయి, శమదమాదులూ ఉంటాయి; ధైర్యమూ ఉంటుండి, భయమూ ఉంటుంది; సాహసమూ ఉంటుంది, పిరికితనమూ ఉంటుంది. ఒకొక సంధర్భంలో ఒకొక దాని ప్రభావం బలీయంగా ఉండవచ్చు. ఒకొకరిలో ఒకొకదాని పాలు అధికంగా ఉండవచ్చు. ప్రతి వ్యక్తిమీదా భిన్న శక్తుల ప్రభావం నిత్యం ఉంటుంది గనుక, యే వ్యక్తి ప్రవర్తనా సరళరేఖలాగా జీవితాంతం ఒకే విధంగా ఉండదు. వ్యక్తులలోని యీ అంతర్వైరుధ్యాలను చిత్రించేదే ఉత్తమ సాహిత్యమని పాత్ర చిత్రణలో పేరెన్నికగన్న సామర్సెట్మాం సూక్తి.

రామమోహనరావుగారి పాత్రల ప్రవర్తనలోని అంతర్వైరుధ్యాలు కూడా ఈ జీవిత యధార్థాన్ని ఆశ్రయించినవే. సూపరింటెండింగ్ ఇంజనీరైనా, పడవ గుమస్తా ఐనా, శంకరశాస్త్రి ఐనా సాధారణ మనుషులు. సాధారణ మానవులలో స్వార్థమూ, గతానుగమన స్వభావమూ, సమాజంలో యేది బలవత్తరంగా వుంటే దానికి తలవొగ్గడమూ ప్రముఖంగా వుండే గుణాలు. కనుక వాళ్ళ నిత్య ప్రవర్తనలో సాహసమూ, త్యాగమూ కనిపించవు. స్వార్థమూ, సంకుచిత్వమే రాజ్యం చేస్తుంటాయి. కాని కొన్ని ప్రత్యేక సమయాల్లో, యే గాంధీ మహాత్మునివంటి వాడో యెదురైనపుడు, వాళ్ళలో సాహసమూ త్యాగబుద్ధి కనిపిస్తాయి. కనీసం గొప్పవాని గొప్పతనాన్ని గుర్తించే కీర్తించే మేరకైనా వాళ్ళ సంకుచిత్వం బ్రద్దలౌతుంది. అది క్షణకాలం మాత్రమే. ఆ గొప్పవాడు అదృశ్యమైనవెంటనే అదే సంకుచితత్వమూ, అదే స్వార్థమూ, మళ్ళీ వచ్చి వాళ్ళ వ్యక్తిత్వాలను బంధిస్తాయి. సాథారణ వ్యక్తులలోని ద్వంద్వ స్వభావానికి మూలం ఇదే. యెంత ధీరోదాత్తులైన మహా పురుషులలోనైనా యూ ద్వంద్వ స్వభావం పూర్తిగా నశించదు. యెపుడో ఒకసారి బయట పడుతూనే వుంటుంది. కాని మనుషుల ద్వంద్వ సభావాన్ని గ్రహించినంత మాత్రాన దాన్ని సాహిత్యంలో చిత్రించటం సులభ సాధ్యంకాదు. యెందుకంటే ద్వంద్వ స్వభావం అనేది హేతురాహిత్యంగా వ్యక్తం కాకూడదు; ప్రతిపాత్రా, ద్వంద్వ స్వభావం యెంత వున్నా, హేతుబద్ధంగానే ప్రవర్తించాలి. పాత్రలూ, సన్నివేశాలూ, అన్నీ కలిసి, మొత్తం నవలలో అంతస్సూత్రంగా వున్న హేతుబద్ధతకు అనుగుణంగానూ వుండాలి. రామమోహన రావు గారి నవలలో యెన్ని పాత్రలు యెంత ద్వంద్వ స్వభావం ప్రదర్శించినా, హేతుబద్ధతకు ఎక్కడా భంగం వాటిల్లలేదు. యే పాత్రం యెంత చిత్రంగా ప్రవర్తించినా, ఆ చిత్రానికి ప్రేరణ యేమిటో మనకు తెలుస్తూనే వుంటుంది. ఒకోసారి ఆ ప్రేరణ స్పష్టంగా తెలియకపోయినా __ ఉదాహరణకు గాంధీపట్లా, నాగేశ్వరరావు పట్లా ముంగండ బ్రాహ్మణ్యం ప్రదర్శించిన సామూహిక ప్రవర్తన కేవలం మంద మనస్తత్వం (mob psychology) అనుకున్నా, వాళ్ళ ద్వంద్వ స్వభావం వాస్తవ జీవితానికి యెంత సన్నిహితంగా వుంది అని మనకు అనిపిస్తూనే వుంటుంది.

ఈ నవల చారిత్రక నవల గనుక ఇందులోని పాత్రల ద్వంద్వ మనస్తత్వానికి ప్రత్యేక ప్రాముఖ్యం వుంది. ఒక యుగసంధిలో భిన్న చారిత్రక శక్తుల మధ్య జరిగే చారిత్రక సంఘర్షణకు అంతర్యుద్ధ స్వభావం ఉంటుందని ముందే గుర్తించినాము. అది మొత్తం సమాజాన్నే గాక కుటుంబాలనే రెండు శిబిరాలుగా చీల్చి, తండ్రీకొడుకులనూ, భార్యా భర్తలనూ పరస్పర శత్రుపక్షాలలో నిలబెడుతుంది. ఆ చారిత్రక సుడిగుండంలో చిక్కుకున్న అబ్బాయినాయుడివంటి కొందరికి అది తీవ్ర అంతస్సంక్షోభరూపం ధరిస్తుంది. మరి యితరులమాట యేమిటి ? చారిత్రక ప్రవాహంలో దిగకుండా ఒడ్డున ఉన్న సాధారణ వ్యక్తులమాట యేమిటి చారిత్రక పరిణామంలో వాళ్ళ పాత్ర యేమిటి ? చారిత్రక సంగ్రామానికి వాళ్ల ప్రతిస్పందన యేమిటి ? ఈ ప్రశ్నలకు సమాధనమే ఆ సాధారణ జీవుల ప్రవర్తనలోని ద్వంద్వ స్వభావం. తమ సాధారణ ప్రవృత్తికి భిన్నంగా ప్రవర్తించడమే చారిత్రక సంగ్రామం పట్ల వాళ్ళ ప్రతిస్పందన. భిన్న చారిత్రక శక్తులలో దేని ప్రభావం బలీయమైనపుడు దానికి అనుగుణంగా ప్రవర్తించడమే వాళ్ళుకూడా అంతర్యుద్ధానికి వెలిగా లేరనడానికి నిదర్శన. వాళ్ళ మనస్తత్వంలోని అంతర్వైరుధ్యం మొత్తం సమాజంలోని అంతర్వైరుధ్యానికి ప్రతిరూపం. సాధారణ జీవులలోని అంతర్వైరుధ్యం చిత్రించకుండా మొత్తం సమాజంలో సర్వగ్రాసియైన అంతర్యుద్ధం జరుగుతూ ఉందనడం అసహజంగా ఉంటుంది. ఆ అంతర్వైరుధ్యమ్ పేలవంగానూ ఉంటుంది. చారిత్రక విప్లవాలను ప్రత్యక్షంగా అనుభవించినవాడు, చరిత్ర సారాన్ని గాఢంగా గ్రహించినవాడూ గనుక రచయిత యూ అంతర్వైరుధ్యాన్ని కేవలం మానవలక్షణంగానే గాక, చారిత్రక లక్షణంగా కూడా చిత్రించగలిగినాడు.

ఒకటిరెండు లోపాలు వున్నా ఆనాటి చారిత్రక వాస్తవాన్ని చిత్రించడంలో ఈ నవల సంపూర్ణంగా కృతార్థమైంది. ఆనాటి సాంఘీక దురాచారాలు అంధవిశ్వాసాలూ, కరడుగట్టిన ఛాందస అజ్ఞానమూ, ప్రభుత్వ దమన నీతి, ప్రభుత్వ అధికార్లలోని బానిస తత్వమూ, వీరికి వ్యతిరేకంగా యువకులూ, దేశభక్తులూ విద్యావంతులూ సాగించిన పోరాటాల ఫలితంగా యేర్పడిన హృదయతాపాలూ, మానసిక సంక్షోభాలు, కుటుంబ విచ్ఛేదాలు అన్నీ కన్నులకు కట్టినట్లు చిత్రితమైనాయి. అన్నీ పాఠకులకు ప్రత్యాక్షానుభూతులుగా రూపుధరించినాయి. చెప్పుకోదగిన చారిత్రక నవల అంటూలేని తెలుగు సాహిత్యంలో యీ నవలకున్న స్థానం అమూల్యమైనది.

దురదృష్టవశాత్తు తెలుగులో చారిత్రక నవలాకారునిగా పేరుకెక్కిన వాళ్ళందరూ ఫ్యూడల్ కుసంస్కారానికీ, సనాతన మూఢాచారాలకూ అంతో ఇంతో బానిసలైనవాళ్ళే. వాళ్ళు రాసిన నవలల్లో గతకాలపు మూర్ఖత్వాలకూ, అజ్ఞానానికి, బానిస బుద్ధికి, భోగలాలసతకూ ధర్మ పరిరక్షణ పేరుతో పట్టాభిషేకం చేయడం తప్ప నిజమైన చారిత్రకత అనేది దాదాపు శూన్యం. ఫ్యూడల్ సంస్కారాన్నే గాక, బూర్జువా సంస్కారాన్ని కూడా అధిగమించి, పరపూర్ణమైన భౌతికవాద దృక్పథం జీర్ణించుకున్నవాడు తప్ప చరిత్రను సరిగా అర్థం చేసుకోలేడు. గతకాలపు ఘటనలను యీనాటి విజ్ఞాన వివేకాలతో అధ్యయనం చేయగలిగేదే చరిత్ర. గతకాలపు రాజులను గురించి వాళ్ల వందిమాగధులు చెప్పిన స్తోత్ర పాఠాలే తిరుగులేని చారిత్రక ప్రమాణాలుగా స్వీకరించిన వాళ్ళు రాసినవే యీనాటి వరకు మనకు చారిత్రక నవలలుగా ప్రసిద్ధిపొందుతూ వచ్చినాయి. తెలుగు నవలా కారులలోనే కాదు, మన జాతీయ పోరాట కాలంనాటి తెలుగుకవుల దేశభక్తి కవిత్వం నిండా యీ గతవైభవ సంకీర్తనా జాడ్యం కరుడు గట్టుకొని ఉంది. గురజాడవలె “మంచి గతమున కొంచెమేనోయ్” అని చెప్పగలిగిన ఆధునిక మనస్తత్వం మన రచయితల కెవ్వరికీ పట్టుబడనేలేదు. గురజాడ తన కాలంనాడు, రచించబడిన “విజయనగర సామ్రాజ్యం” అనే చారిత్రక నవలమీద రాసిన విమర్శను యిక్కడ స్మరించడం అప్రస్తుతం కాదనుకుంటాను. చిత్రమేమంటే గురజాడ మరణించిన 50 యేండ్ల తర్వాతకూడా తెలుగు చారిత్రక నవల దాదాపు అదేస్థాయిలో ఉండడం. అంతకంటే బాధాకరమైన విషయమేమంటే గురజాడ అంతగా తిట్టిపోయిన ఆ నవల యీనాటికీ పునర్ముద్రణలు పొందుతూ తెలుగుదేశపు విశ్వవిద్యాలయల్లో పాఠ్య గ్రంథంగా మన్ననలు పొందుతూ వుంది. తెలుగుదేశపు విద్యావంతుల చారిత్రక పరిజ్ఞానానికి, ఆధునిక మనస్తత్వానికీ యింతకుమించిన నిదర్శనం వుండబోదనుకుంటాను. తెలుగు చారిత్రక నవలను ఆవరించిన యీ గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ యీనాటికి వేగుచుక్కలాగ ఉధ్బవించింది, రామమోహనరావు గారి ’కొల్లాయి గట్టితేనేమి?’. అందువల్ల యీ నవలకు మన సాహిత్యంలో ఒక చారిత్రాత్మకమైన స్థానం ఉంటుంది.
(ఈ వ్యాసంలోని చారిత్రక నవలా లక్షణాలు ప్రపంచ ప్రసిద్ధ మార్క్సిస్టు సిద్ధాంతవేత్త అయిన Georg Lukacs చెప్పినవి.)

(సంవేదన – ఏప్రిల్ 1968)

-సమాప్తం-

****
ఈ నవలని ఉచితంగా ప్రాజెక్ట్ గుటెంబర్గ్ వారి వెబ్సైటులో ఇక్కడ చదవొచ్చు. మహీధర రామమోహనరావు ఇతర నవలలు కొన్నింటిని ఇక్కడ ఉచితంగా చదవవచ్చు.

You Might Also Like

Leave a Reply