Kanthapura: Raja Rao

వ్యాసకర్త: నాగిని. 
అవి స్వార్ధమంటే తెలియని రోజులు..నాలుగు గోడల మధ్య ఎలక్ట్రానిక్ వస్తువుల సాగంత్యం లో గడిపెయ్యకుండా నలుగురితో కలిసి మెలిసి బ్రతికే రోజులు..భారత దేశంలో మనిషిని అసలు సిసలైన సంఘజీవిగా చూడగలిగిన రోజులు..అటువంటి కాలంలో కాంతాపురా అనే దక్షిణాదికి చెందిన కల్పిత గ్రామంలోని కథే ఈ ‘కాంతాపురా’..ఆనాటి స్వాతంత్ర్య సమరానికి కాల్పనిక నేపధ్యంలో రాసిన ఈ నవల ప్రముఖ రచయిత,పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత అయిన శ్రీ రాజా రావ్ రచించారు..ఆయన మరో రచన ‘The Serpent and The Rope’ కి గాను సాహిత్య అకాడెమి అవార్డును సొంతం చేసుకున్నారు..ఈ నవల భారతీయ సాహితీ చరిత్రలో తొలి ప్రఖ్యాత ఆంగ్ల నవలగా ప్రసిద్ధి చెందింది..ఒక సాయం సంధ్య వేళ,దీపాలు వెలిగించాకా,తన వరండాలో నులక మంచం వాల్చుకుని ఒక బామ్మగారు,అచ్చక్క తన గ్రామం గురించి మనతో పంచుకున్న కబుర్లు ఇవి…
Here are few lines from the book..
Karthik is a month of lights,sisters and in Kanthapura when the dusk falls,children rush to the sanctum flame and the kitchen fire,and with broom grass and fuel chips and coconut rind they peel out fire and light clay-pots and copper candelabras and glass lamps.Children light them all,so that when darkness hangs drooping down the eaves,gods may be seen passing by,blue gods,quite gods and bright-eyed gods.And as they pass by,the the dust sings back in to the earth,and night curls again through the shadows of the streets.Oh!have you seen the gods sister ?
మూర్తి అనే బ్రాహ్మణ యువకుడు మహాత్ముని ప్రతినిధిగా గాంధేయవాదాన్ని తన గ్రామానికి పరిచయం  చెయ్యడం,సత్యం మరియు అహింస స్ఫూర్తి తో ఆ గ్రామస్థులు చైతన్యవంతులు కావడం,క్లుప్తం గా ఇదే నవల సారాంశం.సంప్రదాయాలకి ఎదురీదడం అంటే సామాన్యమైన విషయం కాదు..అటువంటిది కుల వ్యవస్థ,అంటరానితనం వ్రేళ్లూనుకుపోయిన ఆ కాలం లో పై చదువులకై పట్నం వెళ్ళిన బ్రాహ్మణ యువకుడు మూర్తి గాంధీజీ ఆశయాలతో ప్రభావితుడై చదువును మధ్య లోనే ఆపేసి ఆయన మార్గాన్ని అనుసరిస్త్తాడు..స్వాంతంత్ర్య సముపార్జనే లక్ష్యం గా పని చేస్తున్న కాంగ్రెస్ సభ్యుడిగా గాంధేయవాదాన్ని తమ గ్రామానికి పరిచయం చేస్తాడు…నాలుగు వర్ణాలు,నాలుగు వర్గాలుగా ఉన్న ఇళ్ళ సముదాయంలో,అంటరాని కులస్థుల గడప తొక్కి మరీ గాంధీ ఆశయాలను ప్రచారం చేస్తుంటాడు..బ్రాహ్మణత్వాన్ని మంటగలుపుతున్నాడని అతడి మీద భట్ట లాంటి అగ్ర కులస్తులు ఆగ్రహిస్తారు…ఈ క్రమంలో తల్లి నూకమ్మ కూడా అతడిని వ్యతిరేకించి,బెంగతో ప్రాణాలు వదులుతుంది..కులబహిష్కరణకు లోనైనా తను నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్తాడు మూర్తి..పటేల్ రంగే గౌడ,శంకర్,రత్న,శీను,రంగమ్మ వంటి కొంతమంది అభ్యుదయవాదులు అతనికి వెన్ను దన్నుగా నిలుస్తారు..Skeffington Coffee Estate కూలీల్ని దుర్భర బానిసత్వం,తాగుడు నుంచి విముక్తుల్ని చెయ్యడానికి వారిని విద్యావంతుల్ని చేయ సంకల్పిస్తాడు మూర్తి..ఇందులో Skeffington కాఫీ ఎస్టేట్ కూలీల దుర్భర జీవనం ద్వారా ఆనాటి బానిసత్వం తీవ్రతను చూపించే యత్నం చేశారు..ఉద్యమకారులు,వారి కోసం లాఠీ దెబ్బలు సైతం లెక్ఖ చెయ్యకుండా పోలీసులకి ఎదురు వెళ్తారు..కానీ ఇంటిదొంగ భట్ట,పోలీస్ బడే ఖాన్ లాంటి కొందరి సాయంతో ఉద్యమాన్ని అణచడానికి ఆంగ్లేయులు అన్ని ప్రయత్నాలు చేస్తారు..చివరకు హింస ద్వారా గ్రామాన్ని అదుపులోకి తీసుకుంటారు..కొందరు సత్యాగ్రహులను ఖైదు చేస్తారు..
The best lines from the book in Murthy’s words,
A cock does not make a morning,nor a single man a revolution,but we’ll build a thousand-pillared temple,a temple more firm than any that hath yet been builded,and each one of you be ye pillars in it,and when the temple is built,stone by stone,and an by man,and the bell hung to the roof and the eagle-tower shaped and planted,we shall invoke the Mother to reside with us in dream and in life.India then will live in a temple of our making.
ఈ నవలలో పశ్చిమ కనుమల్లో,హిమవతీ నదీ తీరాన,ఒక చిన్న మారుమూల కుగ్రామంలో స్వాతంత్ర్య ఉద్యమం బీజాలు ఎలా మొలకెత్తాయో మనకు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు..ఎన్నో ఏళ్ళుగా పాతుకుపోయిన కుల వ్యవస్థకూ,సంప్రదాయాలకూ ఎదురు వెళ్ళడం భారతీయ సమాజంలోనే కాదు ఆ మాటకొస్తే ఏ సమాజం లోనైనా కఠినతరమే..అటువంటిది గాంధీజీ అంటరానితనాన్ని రూపుమాపాలని చేసిన బోధలతో స్ఫూర్తి పొంది ,మూర్తి మొదటి సారిగా ఒక శూద్రుని ఇంటికి వెళ్తాడు.అటువంటి ఒక సందర్భం లో రచ్చన్న గడప తొక్కి మంచి నీళ్ళు త్రాగేటప్పుడు,మూర్తి  అంతరాంతరాలలో ఏదో పాపభీతి ఒక క్షణం అలా మెరిసి మాయమయ్యే సందర్భం చాలా బావుంటుంది..మరో సందర్భంలో  పోలీసులు ఉద్యమాన్ని చిన్నాభిన్నం  చేసి స్త్రీలను అర్ధరాత్రి అడవిలో వదిలిపోతే,దారిలో ఎడ్ల బండి వాళ్ళు వారిని ఉద్యమకారులుగా గుర్తించి,రూపాయి కూడా ఆశించకుండా వారిని క్షేమం గా ఇంటికి చేర్చడం ఆనాడు ప్రజల్లో నెలకొన్న స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి,ఐక్యతకూ నిదర్శనం..అడ్వకేట్ శంకర్ పాత్రకూడా మూర్తి కి ఏ మాత్రం తీసిపోదు..
About Sankar,the advocate:
The friends got angry and called him a fanatic;but he said there must be a few fanatics to wash the wheel of law.. 
గ్రామాలలో పండుగలకూ,పూజలకూ జరిగే హరి కథా కాలక్షేపాలు,అందరూ ఒక కుటుంబంలా చందాలు వేసుకుని పెట్టుకునే భోజనాలు,కార్తీక మాసం దీపాల సందళ్ళు ఇలా పూర్తి స్థాయి గ్రామీణ వైభవాన్ని మన కళ్ళ ముందుకు తీసుకువస్తుంది ఈ రచన..మూర్తి లాంటి విద్యావంతులు పరిచయం చేసేవరకూ వార్తా పత్రికలూ కూడా ఉంటాయన్న సంగతి తెలియని సామాన్య జీవనం గడుపుతూ ఉంటారు ఆ గ్రామస్థులు..బ్లూ పేపర్ లో గాంధీజీ ఉద్యమం గురించి రంగమ్మ లాంటి వారు చదివి వినిపించగా తెలుసుకుంటారు..పూజలు,పండుగ సమయాల్లో భజనలు,హరికథల స్థానే మహాత్ముని కథలు విని గ్రామస్తులు ప్రభావితులవుతారు..ముఖ్యంగా స్త్రీ శక్తి స్వరూపిణి అని నిరూపిస్తూ, మహిళలు అందరూ రంగమ్మ ఆధ్వర్యంలో ఉద్యమకారులుగా శిక్షణ తీసుకోవడం,ధైర్య సాహసాలతో పోలీసులను ఎదుర్కోవడం,పన్నులు కట్టమంటూ ప్రభుత్వానికి ఎదురు తిరగడం లాంటి సందర్భాలు విస్మయపరుస్తాయి..ఈ నవలలో ప్రత్యేకించి పెద్ద కథ అంటూ ఏమీ లేకపోవడం,కథనమే ముఖ్యం కావడం తో రంగమ్మ,పుట్టమ్మ,సతమ్మ,రచ్చన్న,పుట్టన్న అంటూ పదే పదే అవసరం లేని పేర్లను కూడా ప్రస్తావించడం కొంచెం చికాకు పరచింది..చదవడానికి ఇబ్బందిగా,ఒకింత గందరగోళం గా అనిపిస్తుంది..ఏదేమైనా ఈ పుస్తకం చదివితే,నేను-నా కుటుంబం అనే కాకుండా సమాజం పట్ల నైతిక బాధ్యతను గుర్తెరిగి మసలుకునే మనుషులు ఆ కాలం లో ఉండబట్టే మనం ఈరోజు స్వేచ్చా వాయువులు పీలుస్తున్నాము అని తెలుస్తుంది..అంతేకాకుండా స్త్రీ-పురుష,కుల-మత,పేద-ధనిక వర్గ వైషమ్యాలు అన్నీ ప్రక్కన పెట్టి అందరూ కలసికట్టుగా సాధించిన స్వరాజ్యాన్ని ఈనాడు అంతర్గత వైషమ్యాలతో,అన్నిటినీ మించి స్వార్ధం తో దుర్వినియోగం చేసుకుంటున్నాము అని అనిపించక మానదు..
Pages     :190
Price        :210
Publisher :Oxford University press

You Might Also Like

One Comment

  1. brahmeswara rao

    నేను 1979-80 సంవత్సరంలో ఈ నవల మా కోర్స్ లో భాగంగా చదివాను.చక్కటి సుదీర్ఘమయిన వాక్యాలతో,భారతీయ సమాజంలో బాంధవ్యాల వివరణ తో చాలా నచ్చింది.స్కెఫింగ్టన్ కాఫీ ఎస్టేట్ లో కూలీల
    దుర్భర పరిస్తితులను, ఆనాటి సమాజ స్థితిగతునీ ,స్వాతంత్రోద్యమ గమనాన్నీ సూటిగా పరిచయం చేస్తుంది.
    ఈ నవల మరల గుర్తు చేయటం మంచి విషయం.ధన్యవాదాలు

Leave a Reply