రినైసాన్స్ ఇటలీ
కాన్స్టాంటినోపుల్లో వెయ్యేళ్ళు రెపరెపలాడిన గ్రీకో-రోమన్ జయకేతనం ఇస్లాముకి పట్టంకట్టి వచ్చినదారినే పుట్టింటిని పునరుద్ధరించడానికి ఇటలీకి చేరింది. బైజాంటైన్ సామ్రాజ్యం పూర్తిగా పతనం అయ్యేలోపే, ఎంతోమంది గ్రీకు పండితులు, కళాకారులు ఇటలీకి వలసవెళ్లడం ప్రారంభించారు. వారితో బాటుగా, వారి పాండిత్యం, వారి గ్రంథాలయాలు, వారి విప్లవధోరణులు, కొత్త ఆలోచనలు కూడా ఇటలీకి అక్కరకి వచ్చాయి. పదిహేనో శతాబ్దినాటి ఇటలీలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక వాతావరణం, అప్పటికే చిన్న, చిన్న స్వతంత్ర రాష్ట్రాలుగా ఏర్పడిన ఇటాలియన్ నగరాలు, అక్కడి సామాజిక స్వేచ్ఛ మొదలయినవి కూడా కలసి రావడంతో, బైజాంటైన్ సామ్రాజ్య పతనం ఒకరకంగా ఇటలీలో సాంస్కృతిక పునర్జాగృతి ఉద్యమం ఉవ్వెత్తున ఎగియడానికి కావాల్సిన అంతఃప్రభావంగా (Undercurrent) తోడ్పడింది.
పద్నాలుగో శతాబ్దినాటికి, ఇటలీ రాజకీయ పరిస్థితి బైజాంటైన్ సామ్రాజ్యానికి పూర్తి విరుద్ధంగా ఉండేది. పడమటి రోమన్ సామ్రాజ్యపు నామమాత్రపు అధికారాన్ని లెక్కచేయక, ఇంకోపక్క చర్చి మాటలు పెడచెవినపెట్టి, ఇటలీలోని రాష్ట్రాలన్నీ స్వతంత్రాన్ని ప్రకటించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, ఇటలీ సాంస్కృతిక పునర్జాగృతికి (Italian Renaissance) పునాది పడింది. ఇటలీలో గొప్ప వాణిజ్య, వర్తకకేంద్రాలుగా తలెత్తిన వెనిస్, మిలన్, ఫ్లోరెన్సులలో ధనికుల దగ్గర డబ్బేకాకుండా అభిరుచి కూడా ఉండటంతో వారు సాహిత్యం, కళలు, అభ్యాసం, పాండిత్యాలకి పన్నీటిజల్లు పోసి పోషించారు. దిలాసాగా జీవితం నడుస్తున్నప్పుడు, డబ్బు-దస్కం పుష్కలంగా ఉన్నప్పుడు చర్చినేర్పిన భక్తిగీతాలు గొంతుకడ్డం పడితే ఆశ్చర్యంలేదు. ఈ నగరాలన్నిటిలోకి ఫ్లోరెన్సు (Florence) – చర్చి ధనార్జనమీద ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని నిర్లక్ష్యం చేసి బాంకింగు రాజధానిగా వేళ్ళూనింది. భాగ్యవంతులైన పౌరులకి కళలని ప్రోత్సహించడానికి, పుస్తకాలు ప్రచురించడానికి, కొనడానికి, ప్రైవేటు లైబ్రరీలు నెలకొల్పుకోడానికి ఆశ, అనువు చిక్కింది. వ్యక్తులకి, రాజకీయంగాగానీ, మతపరంగాగానీ ఎటువంటి ఆంక్షలకి, కట్టుబాట్లకి తలవొగ్గవలసిన అవసరం లేకపోవడంతో – మానవుడే నా సంగీతం, మానవుడే నా సందేశం అంటూ రినైసాన్సు హ్యూమనిజం ఫ్లోరెన్సు పేరుని సార్థకం చేస్తూ మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరగబూసింది.
గ్రీకు, రోమను తాత్విక, సాహిత్యాలకి పునఃస్వాగతం పలకటం – మొదటితరం హ్యూమనిస్టు రచయితలు చిచెరొవంటి సంప్రదాయ లాటిన్ కవుల ధోరణిలో రాయడానికి ఎంతో ప్రయత్నించేవారు. ప్రాచీన సాహిత్యంపై, తాత్విక చింతనపై, పాత సంప్రదాయాలపై ,రచనలపై ఎక్కడలేని భక్తి శ్రద్ధలు పుట్టుకుని వచ్చాయి. ముఖ్యంగా గ్రీకు భాషా సాహిత్యాలంటే హ్యూమనిస్టులకి అమితమైన ప్రేమ – ఇవే ఒక్క ముక్కలో, రినైసాన్సు హ్యూమనిజం (Renaissance Humanism) ప్రధానమైన లక్షణాలు:
మరికొందరు హ్యూమనిస్టులు లాటిన్ నుంచీ వేరుపడి దేశభాషలలో కవిత్వం, సాహిత్యం సృష్టించారు. పెట్రార్క్ శిష్యుడు బొక్కాచొ (Boccaccio) టస్కన్ మాండలికంలో రాసిన దికామెరోన్ (Decameron) అనే కళాఖండం కూడా దేశభాషలో రాసిందే. ఇంగ్లాండులో జెఫ్రీ ఛాసర్ రచనలు లండను మిడిల్-ఇంగ్లీషుని ప్రాచుర్యంలోకి తెచ్చాయి. దేశభాషల్లో రచనలు రావటంమూలాన, అవన్నీ సామాన్య ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి. పుస్తకాలకి డిమాండు పెరిగింది. పుస్తక వ్యాపారం ఒక వ్యవస్థగా మారింది [26]. దేశభాషల్లో సాహిత్య సృజన జరగడం, ఏ సమాజంలోనైనా ఒక ముఖ్యమైన మార్పు. అది ప్రజానీకంలో స్వతంత్ర కాంక్షని పెంపొందించటానికీ, కట్టుబాట్లనుండీ తెంచుకుని కొత్త దృక్పథం ఏర్పడటానికీ, మానవజీవితంలోని “ఎమోషన్” సాహిత్య వస్తువుగా రూపొందడానికి దోహదపడుతుంది, తద్వారా అంతకుముందు ఉన్న రచనాసూత్రాలన్నీ మారతాయి. ధార్మిక సాహిత్యం ప్రధానంగా బోధనాపరమైనది, దాని పరమావధి మనిషికి సద్బోధ చెయ్యడం, మానవుడి కోరికలకి, ఇష్టాలకి, కలలకి, కక్షలకి కళ్ళెం వేసి, మనిషిని సంఘజీవిగా ఇమడ్చడానికి అది ప్రయత్నిస్తుంది. లౌకిక సాహిత్యం దీనికి పూర్తిగా విరుద్ధం. ఏ చట్రంలోను ఇమడని, ఇమడలేని మానవ జీవితపు హోరు దానికి ప్రధానమైన సాహిత్య వస్తువు [27].
సరే – సామాజిక నేపథ్యంలో స్వతంత్రతకి ఆస్కారం ఉంది, ధనికుల ప్రాపకం ఉంది, కళలని వాణిజ్యంతో ముడిపెట్టే తెలివితేటలున్నాయి. సంప్రదాయ సాహిత్యం అందుబాటులో ఉంది. ఇంక ప్రపంచాన్ని కుదుపుకుదుపే ఉద్యమం ఆవిర్భవించటానికి కావాల్సిందల్లా – పాండిత్యాన్ని ప్రేమోద్వేగాలతో రంగరించి ప్రజల మనస్సులని రంజింపచెయ్యగలిగే ఒక సౌందర్య పిపాసి. ఈ గుణాలన్నీ రినైసాన్సు హ్యూమనిస్టు ఉద్యమానికి పితామహుడిగా కొలుచుకునే పెట్రార్కులోవరదలై పొంగాయి. పెట్రార్క్ లో హ్యూమనిస్టు ఉద్యమంలోని ఉద్రేకం, ఉద్వేగం, విలువలన్నిటినీ ధిక్కరించే ధైర్యం, హృదయాంతర్గత ప్రేమపిపాసకి తప్ప మరిదేనికీ తలవొగ్గకపోవడం మొదలైన లక్షణాలన్నీ మూర్తీభవించాయి. వృత్తిపరంగా పెట్రార్క్ న్యాయవాది. తప్పుడు సాక్ష్యం బనాయించాడనే ఆరోపణ ఆయనమీద పడింది. తన రాజకీయ జీవితానికి గొడ్డలిపెట్టంటి ఆ ఆరోపణని అబద్ధం అని నిరూపించడానికి కూడా ఒప్పుకోలేదు, కోర్టుకి పోలేదు. కోర్టు శిక్ష ప్రకటించింది. ఆయన ఊరొదిలి పలాయనం చిత్తగించాడు – ఊరూరా తిరుగుతూ, అప్పటికే స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్న బొలోన్యాలో (Bologna) కొన్నాళ్ళు కాపరం పెట్టాడు. తండ్రి మరణంతో ఉన్న కాస్త అజమాయిషికూడా పోయి, న్యాయవాద వృత్తికి తిలోదకాలిచ్చాడు. తను అతిగా ప్రేమించిన రచయితల్లా రాయడానికి, వారిని మించడానికి ఉన్న జీవితాన్నంతా ధారబోసాడు. ఇంకొకరికి భార్య అయిన లౌరా అనే సౌందర్యరాశిని నిస్సిగ్గుగా, బహిరంగంగా ప్రేమించాడు. ట్రౌబడార్ల స్వేచ్ఛాగీతికల ఆత్మని పట్టుకున్నాడు. స్వేచ్ఛాప్రియత్వానికి, ప్రేమోద్వేగాలు, నిరంతర అధ్యయనం తోడయి పెట్రార్క్ కలం నుండి కవిత్వం గంగార్భ్హటై ఇటలీని ముంచెత్తింది. అప్పటివరకూ తన అభిమాన రచయితలందరూ రాసిన లాటిన్ భాషకి తిలోదకాలిచ్చి, అప్పటి టస్కన్ మాండలికంలోనే ఇటాలియన్ కవిత్వాన్ని ప్రజల నాలికలమీద నర్తింపచేసాడు. ఆయన కలంలో, ఉవ్వెత్తున ఎగిసే భావోద్వేగాలు యతి ప్రాసల పల్లకిలో ఒద్దికగా పల్లవులు పాడాయి. His poetry was the triumph of Italian vowel over Latin consonants [28].
ఏ దివిసీమలందు చిగురించిన ఏ మధురోహ మాతృకన్
ఆ దరహాసదీప్త రుచిరానన మాకృతి దాల్చెనో! నిజ
స్వాదుకళాప్రపూర్ణతను జాటగ నిట్టి మనోజ్ఞరూపమ
త్యాదరలీల ఆ ప్రకృతి యర్మిలి గూర్చినదేమొ యీ భువిన్!ఏ జలకన్య కప్సరకు నే వనదేవతకిట్లు సొంపుగా
రాజిలు పైడి జాఱుకుఱు లల్లలలాడును పిల్లతెమ్మెరన్
ఈ జవరాలి సద్గుణములెన్నగవచ్చునె! ఆ మహత్వమ
వ్యాజము, కాని దాని పరమావధి నా మరణమ్మునందెగా!ఆమె చంచలనేత్రాల నరయలేడు
తేనె పలుకుల, నగవుల, తీయనైన
ఆమె యూర్పుల నెరుగడు, అంతులేని
ప్రేమతత్త్వము అమృతమ్ము విషమటంచు
తెలుసుకోలేడు, అతడహా! పలవరించు
దివ్యసౌందర్యమునకునై తెలివిమాలి! [29]
తన ప్రేయసి లౌరామీద పెట్రార్క్ రాసిన కవిత హ్యూమనిస్టు ఉద్యమానికి కూడా అంతే చక్కగా వర్తిస్తుందేమో! పెట్రార్క్ సౌందర్య పిపాస ఎంత లోతుగా ఉండేదంటే, రాసిన ప్రతి అక్షరం కూడా అందంగా ఉండాలనేవాడు. ఆ సౌందర్య కాంక్షే, చేత్తో అక్షరాలని రాయడమనే ప్రక్రియని కూడా ఒక కళారూపంగా (కాలిగ్రఫీ)గా మార్చింది.
కాలిగ్రఫీ
ఒక్కో వ్యక్తి మాటకారితనం ఒక్కోలా ఉంటుంది – కొందరు ఎంతసేపు మాట్లాడినా వినాలనిపించేటట్టు ఉంటుంది. కొంతమంది మాట వినసొంపుగా ఉంటుంది, మరికొంతమందిది దైన్యంగానో, లలితంగానో, తుళ్ళుతూనో, హాయిగానో, సౌమ్యంగానో, దర్పంగానో, విద్వత్తు తొణికిసలాడుతూనో, అజ్ఞానం మిన్ను ముట్టుతూనో, మాటమాటకి నవ్వుతూనో, ప్రతి మాటని పట్టి పట్టి పలుకుతూనో – రకరకాలుగా మనుషులు మాట్లాడతారు. ఇది మాట్లాడే శైలి. అలానే, రాయడంలో అక్షరాలని ఎన్ని రకాలుగా రాయవచ్చో ఊహిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్షరం ఒకటే, కాని దానికి అనంతమైన ఆకృతులు కల్పించవచ్చు – మనిషి కల్పనా చాతుర్యానికి హద్దులు లేవనే వాస్తవానికి నిదర్శనం అక్షర స్వరూపమే. సప్త స్వరాలతో సంగీతానికి హద్దులు లేనట్టే, ఒక చిట్టి అక్షరానికి ఎన్ని హొయలో? ప్రతి అక్షరంలోనూ ఇంకా మనం ఊహించని ఎంత అందముందో? అక్షరం ఆకృతినే అధ్యయనం చెయ్యడమే ధర్మంగా, రాయడమనే కర్తవ్యంలోంచి యదేచ్ఛగా చెలరేగిన కల్పనా చాతుర్యమే కళగా, సమాచారాన్ని అందించే సరళమైన సాధనాన్నే సృజనాత్మక మార్గంగా మార్చి, మాటకున్న శబ్దాన్ని ఆకృతిగా మారుస్తూ, అక్షర రూపాలతో చెలరేగిన సౌష్టవ స్వరూప సంగీతమే కాలిగ్రఫీ. అది ఆకృతికి ఆగ్నేయరూపం, మదిలో రెపరెపలాడిన నిశ్శబ్ద ప్రాణాయామానికి సస్వరూప జ్ఞానం. సాధారణమైన చిన్న సంకేతంలో నిబిడీకృతమై ఉన్న సున్నితమైన అంతర్దృష్టిని వెలికితీసే మహత్వ పటుత్వ ధారణా సిద్ధి. అక్షరాలకి చరిత్ర ఆపాదించిన సంకేత రూపానికతీతమైన సౌందర్యాన్ని సంపాదించిపెట్టే చింతామణి.
ఇంతకుముందు చెప్పినట్టుగా, యూరోపులో రినైసాన్సుకి పూర్వం, అన్నింటిలోనూ గోథిక్ శైలిని ఉపయోగిస్తూ ఉండేవారు. చర్చియొక్క రోమన్-లాటిన్ సంప్రదాయాలకి గోథిక్ శైలితో అవినాభావ సంబంధం ఉంది. రినైసాన్సు కళాకారులకి గోథిక్ శైలంటే పడేది కాదు, ఏకమొత్తంగా దానిపై తిరుగుబాటు ప్రకటించారు. ప్రతి కళలోనూ, ప్రతి రంగంలోనూ గోథిక్ శైలికి విరుద్ధమైన, వైవిధ్యమైన విప్లవాత్మకమైన మార్పుని తేవడమే ఒకరకంగా బూజుపట్టిన చర్చి “హెగీమొనీ”పై తిరుగుబాటుగా వారు భావించారు. పవిత్రతని తోసిరాజని, ఆనందానికి, అందానికి గజ్జెలు కట్టి నాట్యం చేయించారు. అప్పటికి మతపరమైన గ్రంథాలన్నీ గోథిక్ దస్తూరిలతోనే రాసేవారు. పెట్రార్క్ – కరొలిఙ్గన్ కాలంనాటి అందమైన, ఒంపుసొంపులున్న చిన్న అక్షరాల దస్తూరిని వెలికితీసి, దానికి కొత్త రూపునిచ్చి “హ్యూమనిస్ట్ దస్తూరి”కి అంకురార్పణ చేసాడు.
దేశభాషల్లో సాహిత్య సృష్టి, సుసంపన్నమైన దేశకాల పరిస్థితుల వల్ల సమ్మోహితులైన కళాకారుల ఉత్తేజం రినైసాన్సు దస్తూరిలని అమితంగా ప్రభావితం చేసింది. కరొలిఙ్గన్ కాలంనాటి బ్లాక్లెటర్, అన్షల్ (Uncial), రోటుండా దస్తూరి శైలిలు తమ తమ “అవసరమైనంత మట్టుకే రూపం, అలంకారం అనవసరం” అనే స్వాభావిక ధర్మాన్ని పక్కన పెట్టి, సౌందర్యకాంక్షా సిరిగంధాన్ని ఒళ్లంతా అలముకున్నాయి. కరొలిఙ్గన్ కాలంనాటి పెద్ద అక్షరాల, చిన్న అక్షరాల మధ్య తేడాలు రినైసాన్స్ కాలంలో ప్రస్ఫుటమై, వాటికో ప్రత్యేకమైన అస్తిత్వం వచ్చింది. అవేకాకుండా, కరొలిఙ్గన్ కాలంలో నామమాత్రంగా ఉండిన గొలుసుకట్టు దస్తూరి కూడా రినైసాన్సు కాలంలో చాలా అభివృద్దిలోకి వచ్చింది. కాలక్రమంలో ఈ హ్యూమనిస్టు రోటుండా హ్యూమనిస్టుల కోకిల పాటలకి లేలేత చూత పల్లవిగా మారింది. ఎన్నో వందల సంవత్సరాలు గడిచినా, ఎన్నో దేశాల్లో, మరెన్నో లిపులకి, డిజిటల్ యుగంలో కూడా ఎన్నో ఫాంట్ల రూపకల్పనకి మాతృకలుగా ఉపయోగపడ్డవి అప్పటి హ్యూమనిస్టుల సౌందర్యకాంక్షతో హొయలు దిద్దుకున్న దస్తూరిలే. ఈనాడు ప్రయోగాల పేరిట ఫాంటు డిజైనర్లు ఇవే శైలులతో ఆటలాడుతూ ఉండొచ్చుగాక, కాని ఈ ఆధునికుల ప్రయోగాలు రినైసాన్సు కళాకారులు సృష్టించిన సృజన శిఖరంపైకి ఎగబాకే చీమలు మాత్రమే అంటారు డోనాల్డ్ అండర్సన్ [30].


[...] పప్పుగారు, శ్రీనివాస్ పరుచూరిగారి “అచ్చుయంత్రానికి పూర్వం పాశ్చాత్య …లాంటి పరిశోధనాత్మక వ్యాసం రావటం [...]
“చెప్పేవాడికి చేసేవాడు లోకువ”
వృత్తి రీత్య శాస్త్రీయ పరిశోధనా వ్యాసాలు చదవడం అలవాటు కావడంతో, ఈ వ్యాసం చదువుతూ ఇందులో ఉదహరించిన ప్రతి విషయానికీ ఆధారాలున్నాయా అని ముందుగా అనుమానించాను. దీనిక్కారణం తెలుగులో ‘పరిశోధనా’ వ్యాసాలు వ్రాసేవారికి ఆధారాలతో అంతగా పనిలేదన్నది నేను చదివినంతలో ఏర్పరచుకున్న అభిప్రాయం. నేను ఎంతగానో నమ్మే పరిశోధకుల వ్యాసాలలో కూడా మూలాధారాలైన గ్రంథాలను, వ్యాసాలను ఉటంకించడంలో అలసత్వం చూశాను. (‘నేను చెప్పిందే వేదం’ అనే సంస్కృతితో కలిగిన అహంభావం కావచ్చునేమోగానీ, శాస్త్ర చర్చకు కావలసిన ఆధారాలకు వ్యక్తిగత నమ్మకాలకు పొంతన లేదన్న విషయం చాలా మంది పండితులకు తట్టకపోవడం శోచనీయం!). శాస్త్రీయ పరిశోధనా సంస్కృతిలో పెరిగిన ఈ రచయితలిద్దరూ, ఆధారాల ఆవశ్యకతను సహజంగా గుర్తించి, ఈ వ్యాసంలో పొందు పరచారు. వ్యాసంలో వివరించిన విషయాలకు సంబంధించిన ఆధారాలలోకి వెళ్ళే అవసరం అందరికీ లేకపోవచ్చు. కానీ చూడదలుచుకుంటే కనిపించేది ‘బృహన్నారదీయాలు’ మాత్రం కాదు. అది, సమగ్రమైన శాస్త్రీయ వ్యాసం. నాకు తెలియని విషయాలు ఈ వ్యాసం ద్వారా తెలుసుకున్నవి చెప్పాలంటే వ్యాసం తిరిగి రాయాలి!అంత ఓపిక ఎలాగూ లేదు గానీ, సాధారణంగా విసుగు పుట్టించే చరిత్రను ఆసక్తికరమైన వస్తువుగా మలచి విజ్ఞానాన్నందించిన మితృలిద్దరికీ అభినందనలు, అభివందనలు తెలుపుతూ, ఈ వరుసలో రాబోయే వ్యాసలకు ఎదురు చూస్తూ ఉంటాను. అందుకే ముందే చెప్పాను, చెప్పేవాడికి చేసేవాడు లోకువని!
Nice article. Please make it in PDF form for downloading and printing. Worth keeping a copy in library.
ఇంతమంచి వ్యాసపరంపర ఇటీవలి కాలంలో తారసపడలేదు. ముందుగా గుర్తు వచ్చింది తిరుమల రామచంద్ర గారే.ఆ తర్వాత వల్లంపాటి మనసులో నిండారు. కేవలం మొదటి పుట చదివి రాస్తున్న మాటలివి. పూర్తిగా చదవి ఆకళింపు చేసుకోగలిగింది చేసుకుని, చేర్చవలసినదున్నా, చర్చించ వలసింది ఉన్నా తప్పక రాస్తాను. అభినందనలతో వివిన మూర్తి
Hello Nagaraju & suresh Gaaru – Your efforts are very much appreciated. You have given us exhaustive information which is very very useful when anyone wanted dwell into history of books. We are looking forward more from you.
Reg
Siva
Spellbound by this article. Hats off to Nagaraju garu and Sreenivas gaaru. Look forward to next parts.
‘పుస్తకం’ గురించిన ప్రస్తావనతో మొదలైన వ్యాసం యావత్తూ విజ్ఞానదాయకంగా, ఆసక్తికరంగా సాగింది. ఇది ‘పుస్తకం’డాట్ నెట్ కే తలమానికమైన వ్యాసంగా నాకు అనిపిస్తోంది. అ’క్షరం’ లాగే ఇటువంటి వ్యాసాలు నాశనం లేనివిగా నిలిచి ఉంటాయి. తెలుగు తప్ప మరే భాషనూ భావంతో సహా అర్ధం చేసుకోలేని నాలాంటి ‘తెలుగు’ వాళ్లకి ఇదో కర దీపిక. ‘శబ్ద రత్నాకరం’ లాంటి పుస్తకాలు కూడ అందుబాటులో లేని రోజులొచాయన్న బెంగను తోలిపారేసే గొప్ప ‘విషయవజ్రం’ ఈ వ్యాసం. పరిశోధన, కూర్పు, అనువాదాల కోసం నాగరాజు గారు, శ్రీనివాస్ గారు పడిన తపన, శ్రమ చెప్పనలవికానివి. వ్యాస పరంపర పూర్తి అయిన తరువాత పుస్తకం.నెట్ వారితో కలిసి రచయితలు చేయాల్సిన పనులు –1. ఇది పుస్తకంగా ప్రచురించడం, 2.తెలుగు పాఠ్యాంశంగా ఇంటర్ మీడియట్ లెవెల్లో పెట్టించడానికి (కొద్ది అత్యాశే) కృషి చెయ్యడం. ఇంత గొప్ప చరిత్ర తాలూకు విషయాల్ని ఇలా చెబుతూంటే, మాలాంటి వాళ్ళ గొంతెమ్మ కోర్కెలు అలాగే వుంటాయి మరి. మరో సారి శ్రీనివాస్ గారికీ, నాగరాజు గారికీ, పుస్తకం.నెట్ వారికీ సంబంధిత కృషీవలురందరికీ ధన్యవాదాలు.
రాజా.
అద్భుతం! పుస్తకం చరిత్ర గురించి ఇంత మంచి వ్యాసం చదివి దశాబ్దాలయింది.
తాళపత్రం లాగా భూర్జపత్రం అని అంటారు గాని, తాటియాకుల్లాగా కాక, భూర్జవృక్షపు బెరడునుండి వలిచి తీసిన పొరలపై వ్రాసేవారు, ఆకులపై కాదు. ఈ విషయాన్ని రాహుల్ సాంకృత్యాయన్ రచన ’విస్మృత యాత్రికుడు’ లో కూడా ప్రస్తావించారు.
కొన్ని బాగా ఆసక్తికరంగా అనిపించిన విషయాలు :
క్రీ.పూర్వం 1800 నాటికే మొసొపొటేమియా, ఈజిప్టు, ఇస్రాయెల్ ప్రాంతాలలో మాటకి – అది పలికినా, రాసినా – ఒక బలీయమైన శక్తి ఉంటుందనే నమ్మకం దృడమైన నమ్మకం ఉండేది – వాటిని బీజాక్షరాలుగా, మహిమాన్వితమైన మంత్రాలుగా భావించేవారు. పవిత్రమైన మతపరమైన సిద్ధాంతాలను రాసినప్పుడుగానీ, పలికినప్పుడుగానీ పొరపాట్లు జరిగితే ఊహించని ఉపద్రవాలు ఎదుర్కొనవలసి వస్తుందని అనుకునేవారు. — మన సంస్కృతిలోనూ ఇలాంటి భయాలు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి కదా! వారికి అప్పట్లోనే అన్నమాట!
2) టాత్ – ఈజిప్టు రాజుల మధ్య సంభాషణ. దానిని ప్రస్తుత వాతావరణానికి అనుసంధానిస్తూ వ్యాసకర్తల వ్యాఖ్యానం
3)రాయడంలో ఒక ఇబ్బంది ఉందనీ, అవే చిన్నబడి అక్షరాల్లో ఆ ఇబ్బందీ లేదనీ – నిజంగా ఈ వ్యాసం చదివేవరకూ నాకు ప్రత్యేకంగా ఎప్పుడూ తోచనే లేదు.
4) తొమ్మిదో శతాబ్దానికే ప్రపంచం చదువుని అంత సీరియస్గా తీసుకోవడం – ఒక్క న్యాయశాస్త్రం తప్ప మిగిలినవన్నే బోధించేవారట. అదీ ఉచితంగా..ఓహ్!
5)కాలిగ్రఫీ ముందు పుట్టింది యూరప్లోనా? ఎక్కువగా చైనా లో విని ఉండడం వల్ల ననుకుంటాను – ఎక్కువగానే ఆశ్చర్యపోయాను.
6_ “ఏ దివిసీమలందు చిగురించిన ఏ మధురోహ మాతృకన్..” – ఈ అనువాదం ఎవరిది? ఇంత అద్భుతంగా అనువదించడమెట్లా సాధ్యం
- ఆ అనువాద కవి పేరొకసారి ప్రస్తావించి ఉంటే బాగుండేదనిపించింది.
7) లేఖకులందరూ ఒకేలా రాయడంకోసం ఏర్పరుచుకున్న శైలీ సూత్రాల ఆధారంగా ఏర్పడిన దస్తూరి ఛాన్సరి — నిజమా! ఆ కాలంలోనే ఎంత ఆలోచన. మనం ఈ కంప్యూటర్ల కాలంలో పుట్టి బతికిపోయాం అనిపించింది – ఇలా అచ్చు గుద్దినట్టు రాయలేకపోతే కష్టమయిపోయేది
8) తోలు పత్రాలు కూడా బైండ్ చేసేవారా? వాటికి వాడుక బట్టి మృదుత్వం వస్తుందనే సంగతి తెలీనిది. చదువుతుంటే అబ్బురంగా అనిపించింది. అప్పట్లోనే అంత ధరకోర్చి మరీ బైండ్ చేసేరంటే – ఆ కాలంలోనే సాహిత్యమంటే వారికి అమితమైన గౌరవం- ప్రేమ అనుకోవాలా? ఎక్కువ మందికి ఆసకతి ఉన్నట్లేనా – లేక తక్కువ మందికి ఇష్టమైనది – అభిరుచీ కాబట్టి అంత ధరా? – ఇక్కడ మాతో పంచుకున్న చిత్రాలు బాగున్నాయి.
9) పేజీల ఎన్నిక- లే ఔట్లు – ఇవన్నీ రచయితలే చేసుకునేవారా? ఇక్కడ కుంచె ప్రస్తావన వచ్చింది కనుక – చైనీస్ కాలిగ్రఫీలో ఇంతే – పిడికిలి పుస్తకానికి ఆనకూడడు. అది నియమం. కుంచె పట్టుకున్నట్టే పై నుండీ పట్టుకుని, చేయంతా కదుపుతూ అక్షరాలు రాస్తూ పోవాలి.
10 ) “కొంత ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, ఆ రోజుల్లో లేఖర్లగా చాలామంది స్త్రీలు కూడా ఉండేవారు.” — ఆశ్చర్యం అని వ్యాసకర్తలు ఎందుకన్నారో తెలుసుకోవాలని ఉబలాటంగా ఉంది. కళల్లో, ముఖ్యంగా చిత్రలేఖనం వంటి వాటిలో స్త్రీలకు చక్కటి ప్రావీణ్యం ఉంటుంది కదా! అటువంటప్పుడు – ఎక్కువ మంది స్త్రీలే లేఖరులుగా ఉండడం సమంజసమైనదిగానే కనపడుతోంది కదా..?
11) ఆఖరులో కొలిచాల వారు చేసిన అనువాదమూ అద్భుతం
– నిడివితో నిమిత్తం లేకుండా, హాయిగా చదువుకుపోతూ, ఆశ్చర్యపోతూ, ఆ కాలపు రహస్యాలను చదువుతూ – - – టైం మిషన్లో విహరిస్తున్నంత అందమైన అనుభూతినిచ్చిందీ వ్యాసం. మిగిలిన భాగాల కోసం చూస్తూంటాం.
Thank you!
>> 6_ “ఏ దివిసీమలందు చిగురించిన ఏ మధురోహ మాతృకన్..” – ఈ అనువాదం ఎవరిది? ఇంత అద్భుతంగా అనువదించడమెట్లా సాధ్యం – ఆ అనువాద కవి పేరొకసారి ప్రస్తావించి ఉంటే బాగుండేదనిపించింది.
అనువాదకులు భైరవభట్ల కామేశ్వరరావుగారు. వ్యాసకర్తలు వారి పేరు Acknowledgments భాగంలో ప్రస్తావించారు.
“ఈవ్యాసం కోసం పెట్రార్క్ ఇటాలియన్లో రాసిన సానెట్ అనువదించవలసి వచ్చింది. ఎంత ప్రయత్నించినా సానెట్ లయ తెలుగులో వచ్చింది కాదు. నర్సు ఆపరేషను చేస్తే అసలుకే మోసం వస్తుందని సురేశ్ కొలిచాలగారిని, భైరవభట్ల కామేశ్వరరావుగారిని అడిగాం. అడిగినవెంటనే, ఇద్దరూ అనువాదం చేసి పంపారు. కామేశ్వరరావుగారు, సానెట్ లయని తెలుగు ఛందస్సులోకి అవలీలగా అనువదించారు.”
My bad..
నిజమే – నేను కాస్త వేరుగా అర్థం చేసుకున్నాను ఆ వాక్యాన్ని. మీరు చెప్పాక అర్థమైంది.
Thank you for the quick response.
ఈ కింది విషయాలు మీకు తెలుసా?
– ఈనాడు వాడుకలో ఉన్న మూడువేల పైచిలుకు భాషల్లో లిఖిత సాహిత్యం ఉన్న భాషలు గట్టిగా లెక్కపెడితే వందకిలోపే.
– క్రీ.పూ. రెండో సహస్రాబ్దినాటికే ఈజిప్టులో ఆరువందల పదచిత్రాలు, వంద ధ్వనిచిత్రాలు, ఇరవైనాలుగు అక్షర సంకేతాలతో కూడిన లిపి ఉండేది.
– అస్సీరియాలో క్రీ.పూ. ఏడోశతాబ్దినాటికే ప్రపంచంలో అతి పెద్ద లైబ్రరీ ఉండేది; ఆ లైబ్రరీకిచెందిన కొన్ని మట్టిపలకలు ఈనాటికీ సురక్షితంగా ఉన్నాయి.
– క్రీ.శకం 647 లో అలగ్జాండ్రియాని ఆక్రమించుకున్న కాలిఫ్ “అలగ్జాండ్రియా లైబ్రరీలో ఉన్న పుస్తకాలు కొరానుతో సమ్మతిస్తే వాటి అవసరం మనకిలేదు, విభేదిస్తే అవి మనకి అక్కరలేదు” అని అలగ్జాండ్రియా లైబ్రరీని తగలబెట్టించాడట.
– మన వైదికసాంప్రదాయకర్తలలాగే, సోక్రటీస్ కూడ సాహిత్యాన్ని రాయకూడదని అనుకునేవాడు. రాతకన్నా వాక్కు ఎంతో గొప్పదని నమ్మేవాడు.
– రోమన్ సామ్రాజ్య విస్తరణతో పాటు మతపరంగా క్రిస్టియన్ మతం, రాత విషయంలో ఈనాడు ప్రపంచాన్ని శాసిస్తున్న లాటిన్లిపి పశ్చిమ యూరప్ అంతా విస్తరించాయి.
ఇలాంటి ఎంతో విలువైన సమాచారం ఈ వ్యాసం చదివే తెలుసుకున్నాను. పుస్తకంయొక్క సాంస్కృతక, సామాజిక చరిత్రని లోతుగా అధ్యయనం చేసి, లిపుల ఆవిర్భావంనుంచీ, ప్రింటింగు యంత్రం కనిపెట్టడానికి పూర్వం వరకూ పాశ్చాత్య పుస్తక సంస్కృతిని చారిత్రకదృక్పథంతో సమగ్రంగా సమర్పించే గొప్ప ప్రయత్నం. నాకు తెలిసినంతవరకూ తెలుగులో ఇటువంటి సమగ్రమైన విశ్లేషణ ఇంతవరకూ ఎవరూ చేయలేదు. ఇటువంటి అధ్యయనాన్ని తలకెత్తుకున్న నాగరాజుకు, శ్రీనివాసుకు నా జోహార్లు. భారతీయ పుస్తక సంస్కృతిపై వారు రాయబోయే వ్యాసాలకై ఎదురుచూస్తుంటాను.
Sumptuous Meal.
Just one word – fantastic!
Wow!
Pustakam scored a coup with this!
Nagaraaju gaaru and Sreenivas – This is the kind of work I have always expected from you. I am eagerly looking forward to more from you!